మానవత్వానికి నిలువెత్తురూపంగా నిలిచారు.. ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తండ్రి లేని ఓ పసికందు బాధ్యత తీసుకుని,ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఎమ్మెల్యే మంచి మనసుకు ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక శ్రీకృష్ణదేవరాయ వీధిలో నివాసం ఉంటున్న రాజేష్ గత నెల 7న తొండూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇతనితో పాటు మరో ఇరువురు మృత్యువాత పడ్డారు. రాజేష్ చనిపోయే నాటికి అతని భార్య షబానా గర్భిణి. సోమవారం ఆమె జిల్లా ఆస్పత్రిలో ప్రసవించి మగ బిడ్డకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి వార్డుకు వెళ్లి షబానా, పసికందు ఆరోగ్య స్థితిగతులపై వైద్యులతో మాట్లాడారు. ఆమె బిడ్డను చేతుల్లోకి తీసుకొని రాజేష్ రూపంలో దేవుడు పంపించాడని, . ‘దిగులు పడ వద్దమ్మా.. ఈ బిడ్డ బాధ్యత నేను తీసుకుంటా ’ అని రాచమల్లు అన్నారు. బాబుకు 19 ఏళ్లు వచ్చే నాటికి రూ. 10 లక్షలు చేతికి వచ్చేలా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తానని, ఆ డబ్బు అతని జీవనోపాధి కోసం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ పని చేస్తానంటూ షబానాకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…ముగ్గురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకొని వెళ్లగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కేవలం రెండు రోజుల్లోనే రూ. 5 లక్షలు చొప్పున ముగ్గురి కుటుంబాలకు అంద చేశారన్నారు. మంచి మనసుతో తండ్రిలేని ఒక పసికందు బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి భరోసాగా నిలిచిన ఎమ్మెల్యే రాచమల్లును ప్రొద్దుటూరు ప్రజలు అభినందిస్తున్నారు. మా ఎమ్మెల్యే సార్..మానవత్వానికి నిలువెత్తు రూపం అంటూ రాచమల్లుపై ప్రశంసలవర్షం కురిపిస్తున్నారు.
