ఏపీలో అతి కొద్ది కాలంలోనే టీడీపీ అంతర్ధానం కానుందా…చంద్రబాబు, లోకేష్లు ఫ్యూచర్లో బీజేపీలో చేరుతారా…ప్రస్తుత ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే..బాబు, లోకేష్లు కాషాయ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో వైయస్ఆర్సీపీ తిరుగులేని విజయం సాధించడం, సీఎంగా జగన్ 50 రోజుల్లోనే పలు ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడం, దేశంలోనే 3 వ అత్యుత్తమ సీఎంగా నిలవడం, 30 ఏళ్లు అధికారంలో ఉండేలా జగన్ పక్కా ప్రణాళికతో దూసుకుపోతుండడంతో ప్రస్తుతం టీడీపీలో నైరాశ్యం నెలకొంది. అధికార పార్టీపై చంద్రబాబు, లోకేష్లు చేస్తున్న అర్థంపర్థం లేని విమర్శలు పార్టీ పరువు తీస్తున్నాయి. దీంతో టీడీపీ నేతల్లో తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది. ఒక పక్క టీడీపీ నేతలకు జగన్ డోర్లు క్లోజ్ చేయడంతో చేసేదేమి లేక తెలుగు తమ్ముళ్లు కాషాయ పార్టీవైపు తొంగి చూస్తున్నారు.
తొలుత టీడీపీ రాజ్యసభ పక్షాన్ని ఎంపీలు బీజేపీలో విలీనం చేశారు. సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లాంటి టీడీపీ ఆర్థిక మూలస్థంభాలు, బాబుగారికి అత్యంత సన్నిహితులు బీజేపీలో చేరడం వెనుక బాబుగారి ప్రమేయం ఉందనే వార్తలు వచ్చాయి. జగన్ సర్కార్ తన పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తే కేసుల్లో ఇరుక్కుంటాననే భయంతోనే తన పార్టీ ఎంపీలను స్వయంగా చంద్రబాబే బీజేపీలోకి పంపాడని ఊహాగానాలు వచ్చాయి. తన అనుచరులైన ఎంపీల రాయబారంతో తాను కేంద్రంతో లాలూచిపడి కేసుల నుంచి తప్పించుకోవచ్చనే ప్లాన్తోనే చంద్రబాబు టీడీపీ రాజ్య సభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయించాడనే వార్తలకు తాజాగా సుజనా చౌదరి జగన్పై చేసిన విమర్శలు బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు వరద ముంపుకు గురైన కరకట్ట ప్రాంతంలో ప్రభుత్వం డ్రోన్ల కెమెరాలను వినియోగించడంతో తనకు భద్రత లేదంటూ చంద్రబాబు ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ఫోన్ చేసాడన్న వార్తలు…టీడీపీ, బీజేపీల మధ్య చీకటి బంధాన్ని బయటపెడుతున్నాయి.
ఇక చంద్రబాబును ఓటుకు నోటు కేసు ఎప్పటికీ పట్టిపీడిస్తూనే ఉంటుంది. అదే కేసు భయంతో ఉమ్మడి రాజధానిపై హక్కును వదులుకుని మరీ హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చాడు చంద్రబాబు. దీనికి తోడు రాజధాని,పోలవరం, ఇసుక అక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్ విచారణ జరిపించడం చంద్రబాబు, లోకేష్లకు ఆందోళన కలిగిస్తుంది. విచారణలో అక్రమాలు తేలితే..తండ్రీ కొడుకులు జైలుకు పోవడం ఖాయమని ఏపీ రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే చంద్రబాబు, లోకేష్లకు నిద్ర పట్టని పరిస్థితిని కల్పించింది. ఈ కేసుల్లోనుంచి తప్పించుకోవాలంటే..బీజేపీకి సరెండర్ కాక తప్పని పరిస్థితి తండ్రీ కొడుకులకు ఏర్పడింది. మరోవైపు కనీసం మరో పదేళ్లు అధికారంలోకి వచ్చే సూచనలు లేకపోవడం, పార్టీ పూర్తిగా బలహీనపడడంతో చంద్రబాబు, లోకేష్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అందుకే బీజేపీలో చేరితే ఎలా ఉంటుందనే ఆలోచనలో తండ్రి కొడుకులు ఉన్నట్లు సమాచారం. అందుకే ముందస్తుగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసి మరీ, అమిత్షా, రాజ్నాథ సింగ్ వంటి నేతలతో చంద్రబాబు టచ్లో ఉన్నట్లు సమాచారం.
ఇక చంద్రబాబుకు కూడా వయసైపోవడం, లోకేష్కు పార్టీని నడిపించే సామర్థ్యం లేకపోవడంతో టీడీపీ నేతలంతా మూకుమ్మడిగా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేసుల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరడమే బాబు, లోకేష్ల ముందున్న ఏకైక ఆప్షన్. అందుకే తమ పార్టీ నేతలంతా బీజేపీలో చేరుతున్నా…సైలెంట్గా ఉంటున్నారు. పార్టీ క్యాడర్ను కాపాడుకునే ప్రయత్నమే చేయడం లేదు. ప్రస్తుతం పరిస్థితులుఇలాగే కొనసాగితే…టీడీపీ తెలంగాణ, ఏపీలో పూర్తిగా బీజేపీలో విలీనం కావడం ఖాయమని, బాబు, లోకేష్లు కూడా కాషాయ కండువా కప్పుకున్నా ఆశ్చర్యం లేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇంతకీ బాబు, లోకేష్లు బీజేపీలో ఎప్పడు చేరుతారంటూ..తెలుగు తమ్ముళ్లు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి బాబు, లోకేష్లు బీజేపీలో చేరుతారంటూ..వైసీపీ, బీజేపీలు మాత్రమే ప్రత్యర్థులుగా మిగులుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి బాబు, లోకేష్లు బీజేపీలో చేరుతారా…లేదా…పార్టీని కాపాడుకుంటారో చూడాలి.