మిషన్ భగీరథ అద్బుతం అని.. ప్రతీ ఇంటికి శుద్ధి చేసిన నీటిని అందించడం గొప్ప విషయం అన్నారు కేంద్ర తాగునీటి సరఫరా విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్. మిషన్ భగీరథతో తెలంగాణ తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. వివిధ రాష్ట్రాల్లోని తాగునీటి పథకాల పనితీరును పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ , మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వెళ్లారు. నాగసాల లో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. నీటి శుద్ధి ప్రక్రియను చూసారు. అక్కడి నుంచి జడ్చర్ల మండలం కేతిరెడ్డి పల్లె , నందారం గ్రామాల్లో, భగీరథ నీటి సరఫరా పై గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకున్నారు. నీటి నాణ్యత, సరఫరా సమయం గురించి అడిగారు. భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి తమకు కష్టాలు తీరినాయని గ్రామస్తులు చెప్పారు. భగీరథ నీళ్లు బాగున్నాయన్న గ్రామస్తులు, తాము అవే నీటిని తాగుతున్నామని చెప్పారు. ఆ తరువాత షాదనగర్ కమ్మదనం లో నిర్మించిన wtp ని డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ పరిశీలించారు. అన్నారం, బలిజరాల తండా గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. భగీరథ నీళ్లు సరఫరా అవుతున్న తీరుపై గ్రామస్తులను ప్రశ్నించారు. భగీరథ నీళ్ల ప్రమాణాలు బాగున్నాయని గ్రామస్తులు చెప్పారు. ఎంతో శ్రమకోర్చి తాగునీటిని సరాఫరా చేస్తున్నారని అధికారులను రాజశేఖర్ ప్రశంసించారు.ఈ పర్యటనలో చీఫ్ ఇంజినీర్ చెన్నా రెడ్డి, కన్సల్టెంట్ నర్సింగరావు, ఎస్.ఈ సీతారాం, ఈ.ఈలు వెంకట్ రెడ్డి, పద్మలత లు ఉన్నారు.
