కర్నూలు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. కాగా ఇదివరకే తన కుటుంబ సభ్యులతో కలిసి అమరావతికి వెళ్లిన కోట్ల సీఎం చంద్రబాబును కలిసారు. అయితే సీట్ల విషయంపై స్పష్టమైన హామీ రాకపోవడంతో టీడీపీలో చేరడానికి కోట్ల సాహసించలేదనే వార్తలొచ్చాయి. అలాగే టీడీపీలో కోట్ల దాదాపు చేరిపోయినట్లేనని చానెళ్లు, పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన కోట్ల అసలు విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని మొదట అన్నారు.. కానీ కొద్దిరోజులకే మళ్లీ పొత్తుల్లేవన్నారు. కాంగ్రెస్ విధి విధానాలు నచ్చకనే బయటకు తాను బయటికి వచ్చానన్నారు. టీడీపీలో నేను చేరానన్నది అబద్ధం. పత్రికల్లో కొందరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసేశారు. రైతులు, నా కార్యకర్తల కోసం ఎల్ఎల్సీ, వేదవతి, గుండ్రేవుల, ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి చేస్తానని మాట ఇస్తే తాను టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నానని కోట్ల స్పష్టం చేశారు. టీడీపీలో చేరిక ముహూర్తం ఖరారైందనకుంటున్న టైమ్లో ఒక్కసారిగా ఇలా మీడియా ముందుకు రావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఒక్కసారిగా కోట్ల యూటర్న్ తీసుకోవడంతో జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కంగుతిన్నారట.. ఆయన డిమాండ్ చేస్తున్న ప్రాజెక్టు పనులకు టీడీపీ నుంచి స్పందన వస్తుందా అనేది సస్పెన్స్.. పార్టీ టికెట్లతో పాటు పెండింగ్ పనుల విషయంలో స్పష్టత రాని నేపధ్యంలో ఆయన టీడీపీకి దూరమయ్యారని ఇక కచ్చితంగా వైఎస్సార్సీపీలో చేరతారని ప్రతిపక్ష పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
See Also: