ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.. ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలన్నీ అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన వెంటనే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోజు నుంచీ ప్రభుత్వ సభలను సైతం తన పార్టీ ప్రచార సభలుగా నిర్వహిస్తున్నారు. జగన్ కూడా ఎలాగే పాదయాత్ర ద్వారా ప్రచారానికి తెరతీశారు. పవన్ కూడా అక్కడక్కడ సమావేశాలు, పర్యటనలతో బిజీ అయ్యారు. ఇక కాంగ్రెస్ కిరణ్ రాకతో ప్రభావం చూపేలా ప్రయత్నిస్తోంది. ఇక బిజెపికూడా అలయన్స్ తో అధికారంలోకి వచ్చేలా వ్యూహరచన చేస్తోంది. అలాగే కమ్యూనిస్టులు కూడా ప్రచారానికి సిద్ధమయ్యాయి. అయితే వీరంతా సాధారణ ప్రచారం కంటే సోషల్ మీడియాలో ప్రచారానికి తెరతీసారు. సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలకు ఊపు రప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయా పార్టీలు ఐటి, సోషల్మీడియా వింగ్ ల ద్వారా లక్షలు ఖర్చు చేస్తున్నారు.
ఒక ఎమెల్యే అభ్యర్ధి ఖర్చు చేసే మొత్తంలో కేవలం రెండు శాతం ఖర్చు సోషల్ మీడియాకు వెచ్చిస్తే ప్రచారం బావుంటుందని ఓట్ల ప్రభావం సోషల్ మీడియా ద్వారా ఓ 10శాతం మారినా గెలుపునకు ఉపయోగం అవుతుందని భావిస్తూ పార్టీ ప్రచారాల్ని సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు. సలహాదారు ప్రశాంత్ కిశోర్ తన అనుభవాన్ని రంగరిస్తూ సోషల్మీడియాలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు వైఫల్యాలను ఎండగడుతూ తటస్తులను సైతం ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్కళ్యాణ్ తన పార్టీ తరుపున శతఘ్ని అంటూ సోషల్మీడియా విభాగం ఏర్పాటు చేసుకుని అధికార పార్టీపై విమర్శలు కురిపిస్తోంది. సోషల్మీడియా ఏర్పాటుకు ఇప్పటికే పవన్ పార్టీ హైదరాబాద్లో భారీ భవనాన్ని అద్దెకు తీసుకుని, ఏర్పాట్లు చేసుకుంది. దీని పర్యవేక్షణను సీనియర్ నేతకు అప్పగించింది. బిజెపి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సోషల్మీడియా విభాగం ఆంధ్రప్రదేశ్ విషయాలపై ప్రత్యేకంగా స్పందిస్తోంది. లెక్కలతో చుక్కలు చూపిస్తోంది బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవినీతికి మారుపేరుగా మారిందని ప్రచారం చేస్తూ తాము నిధులిస్తే అవి రాష్ట్రానికి చెందిన నిధులంటూ ప్రచారం చేసుకుంటున్నారని, మోడీ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇచ్చారని చెప్పుకుంటోంది.
ఇక అందరూ ఇలా చేస్తే అధికార తెలుగుదేశం పార్టీ ఊరుకుంటుదా.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్లు ప్రత్యేకంగా ఓ సోషల్మీడియా వింగ్ను ఏర్పాటు చేసారు. వారికి శిక్షణా తరగతులు నిర్వహించారు. పదులసంఖ్యలో వెబ్ సైట్లు ఏర్పాట్లు చేసారు.. జగన్ పై విరుచుకుపడాలని ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. అయితే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా మాత్ర చాలా స్పీడుగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది యువకులు, విద్యార్ధులు, పార్టీ కార్యకర్తలు స్వచ్ఛంధంగా జగన్ కు, ఆపార్టీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి సాధనాలతో చంద్రబాబును ఏకిపారేస్తున్నారు. అలాగే పెద్దలు, మేధావులు, తటస్థులు, విద్యావంతులు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ, పాలనా వైఫల్యాలను, హామీలను నిలదీస్తున్నారు.