తెలంగాణ రాష్ట్రం పట్ల కృష్ణా నది యాజమాన్య బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. బోర్డు సమర్ధంగా పనిచేయకపోగా.. పక్షపాత ధోరణి అవలంభిస్తోందని, ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. భవిష్యత్ లో ఇది తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుందని పేర్కొన్నారు.
నీటి విడుదలలో పక్షపాతంతో పాటు.. టెలీమెట్రీ ఏర్పాటులో ఆలస్యం చేస్తోందని కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. పోతిరెడ్డిపాడు దగ్గర టెలీమెట్రీ వివరాలు తారుమారు చేస్తున్నారని, ఈ విషయం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కేంద్రమంత్రిని మంత్రి హరీశ్ రావు లేఖలో కోరారు.