ఏపీలో మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. అత్యంత దారుణంగా మరో దారుణం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై అదే గ్రామ పోతురాజ రజనీ కుమార్ లైంగిక వేధింపులుకు పాల్పడిన నేపథ్యంలో శనివారం ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ద్రాక్షారామ ఎస్ఐ ఎన్.సతీష్బాబు తెలిపిన వివరాలు ప్రకారం . భర్త, ఇద్దరు పిల్లలతో సదరు వివాహిత ఉండూరు ఎస్సీ పేటలో నివసిస్తోంది. ఎనిమిది నెలల క్రితం ఆమె తాటాకు దడిలో స్నానం చేస్తుండగా పోతురాజు రజనీకుమార్ రహస్యంగా ఫోటోలు తీశాడు. అనంతరం నగ్నంగా ఫొటోలు తీశానని తన కోరిక తీర్చాలని ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులు తాళలేక గ్రామంలో శెట్టిబలిజ పేట సమీపంలోని ఇంటిలోనికి మారిపోయింది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి సదరు వివాహిత నివసిస్తున్న ఇంటికి వెళ్లి తన కోరిక తీర్చాలని మళ్లీ బెదిరించాడు. దీంతో విధిలేని స్థితిలో ఆమె శనివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. గమనించిన భర్త నిలువరించి ఆమెను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్ఐ సతీష్బాబు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
