నందమూరి అభిమానులకే కాదు, తెలుగు సినీ అభిమానులకు కూడా ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రతిష్టాత్మకమైన దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోపిక్ చిత్రం నుంచి దర్శకుడు తేజ తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇటివలే ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవం మార్చి 29న హైదరాబాద్లో జరిగిన విషయం తెలిసిందే. తేజ దర్శకత్వంలో ఎన్.బి.కే ఫిలింస్ పతాకంపై విబ్రి మీడియా సమర్పణలో ఈ చిత్రం మొదలైంది. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే అనుకోకుండా బుధవారం ఈ చిత్రం నుంచి తేజ తప్పుకుంటున్నారనే వార్త వచ్చింది.
‘‘ఎన్టీఆర్ లాంటి మహా వ్యక్తి చరిత్రను తెరకెక్కించలేనేమో అనే భయంతోనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నాను’’ అని దర్శకుడు తేజ చెప్పినట్లుగా సినిమా పి.ఆర్.వో తెలిపారు. తేజ బయటకు వచ్చారనే వార్త రావడంతో నెక్ట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరు? అనే చర్చ మొదలైంది. సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు ఆ బాధ్యత నిర్వహించే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి.