తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. శనివారం నాడు ప్రగతి భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తూ హరీశ్ రావును కేసీఆర్ ఆకాశానికి ఎత్తారు. “తెలంగాణ రాష్ట్ర ప్రజలు హరీశ్ పై కోటి ఆశలు పెట్టుకున్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తారని తమకు నీళ్లు ఇస్తారని మంత్రి హరీష్ పై ఎంతో ఆశలు, నమ్మకంతో ఉన్నారు.
దానికి అనుగుణంగానే ఆయన ఎంతో చురుగ్గా పని చేస్తున్నారు. మహారాష్ట్ర తో ఒప్పందం విషయంలో మంత్రి హరీష్ బాగా పని చేశారు.“ అని కితాబు ఇచ్చారు.`కాళేశ్వరం ఈ.ఎన్సీ వెంకటేశ్వర్లు కూడా మహారాష్ట్ర ఆధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. ప్రాజెక్ట్స్ పూర్తి కావడానికి కూడా ఇదే పట్టుదలతో పని చేయాలి.
ఇకపై మంత్రి హరీష్ రావు 10 రోజులకు ఒక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టుకు సందర్శించాలి. నెలకో సారి నేను, సీ.ఎస్ కూడా కాళేశ్వరం పనులు స్వయంగా చూస్తాం. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు వరకు నీళ్లు తీసుకురావడం చాలా ముఖ్యం. ఈ పనులు చేయడానికి ఇప్పటికి 200 రోజులు చేతిలో ఉన్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పనులు సత్వరం పూర్తి చేయాలి“ అని సీఎం కేసీఆర్ అన్నారు.