ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి రోజా ఇలాకా నగరిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఈ సంవత్సరం నిధులను సీఎం జగన్ స్వయంగా బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. నగరిలో సీఎం జగన్ పర్యటనను మంత్రి రోజా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.
బుధవారం నాడు వడమాలపేట మండల వడమలపేట సర్వసభ్య సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వడమాలపేట మండలంలో గడపగడపలో మంజూరైన అభివృద్ధి పనులన్నీ అలాగే నాడు – నేడు స్కూల్ రెన్యువేషన్ పనులన్నీ వెంటనే పూర్తి చేయమని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా గ్రామాలలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చూసుకోవాలి, అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పరికరాలు, మెడిసిన్స్ అందుబాటులో ఉండాలని సూచించారు. అవసరమైతే రోజా_చారిటబుల్_ట్రస్టు ద్వారా తెప్పిస్తామరి అన్నారు.
ఈనెల 28వ తేదీన #జగనన్న_విద్యా_దీవెన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నగిరి పట్టణానికి వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా తీసుకొని విజయవంతం చేయాలని, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించి, ఎన్ని కుట్రలు ఎదురైనా ఎదురొడ్డి నిలబడి దేశ స్థాయిలో రాష్ట్ర ప్రగతిని పథకాన్ని ఎగరవేసిన జగనన్నకు మనమందరం ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. మొత్తంగా నగరికి సీఎం జగన్ వస్తున్న సందర్భంగా భారీ బహిరంగసభతో తన సత్తా చాటాలని మంత్రి రోజా పట్టుదలతో ఉన్నారు.