వివాదాస్పద దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రెడ్డికి సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది. నీలాంటి రౌడీ షీటర్లకు ఇక్కడ ఎంట్రీ లేదు చింతమనేనికి నూజివీడు డీఎస్పీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం వీరమ్మకుంట సర్పంచ్ స్థానానికి ఇవాళ పోలింగ్ జరిగింది. ఈ స్థానంలో విజయం సాధించాలని టీడీపీ, వైసీపీ పట్టుదలతో ఉన్నాయి. ఉదయం వీరమ్మకుంట పోలింగ్ కేంద్రం వద్దకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెళ్తున్న సమయంలో నూజివీడు డీఎస్పీ అశోక్ కుమార్ ఆపారు. రౌడీ షీటర్ ను పోలింగ్ కేంద్రం వైపు రానివ్వమంటూ డైరెక్ట్ గా చింతమనేనిని ఉద్దేశిస్తూ వార్నింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్ అయితే ఎందుకు బౌండోవర్ చేయలేదని.. చింతమనేని డీఎస్పీని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న అందరినీ పంపితే తాను కూడా వెనక్కి వెళ్లిపోతానని చింతమనేని ప్రభాకర్ చెప్పారు. ముందు తనకు మీరు సహకరించాలని.. డీఎస్పీ చింతమనేనికి సీరియస్ గా కోరారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చింతమనేనిని గ్రామంలోకి అనుమతించాలని కొందరు స్థానిక టీడీపీ నేతలు డీఎస్పీని కోరారు. అందుకు నిరాకరించిన డీఎస్పీ చింతమనేనిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. దీంతో చేసేదేమి లేక చింతమనేని ప్రభాకర్ అక్కడ నుంచి అవమానభారంతో నిష్క్రమించారు. చింతమనేని లాంటి మాజీ ఎమ్మెల్యేను రౌడీషీటర్ గా సంబోధిస్తూ డీఎస్పీ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.
