ఆ లేడీ.. ఓ దొంగను ప్రేమ పెండ్లి చేసుకున్నది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. అతడిని వదిలేసి, మరో దొంగతో సహజీవనం చేసింది. అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్షిప్లో ఉంటూ విలాసాలకు అలవాటుపడింది. చివరికి నకిలీ పోలీస్ అవతారం ఎత్తి కిలేడీగా మారింది. ఆమె ఆటలు పసిగట్టిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకెళితే.. గుడిసెల అశ్విని ఇంటర్ వరకు చదివి, ఇండ్లలో దొంగతనాలు చేసే రోహిత్శర్మ అనే ఒక వ్యక్తిని ప్రేమ పెండ్లి చేసుకున్నది. వీరికి ఇద్దరు పిల్లలు.
తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావటంతో అతడిని వదిలేసి, రోహిత్ సింగ్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఇతడిని కూడా వదిలేసి అభిషేక్తో కలిసి ఉంటున్నది. ఇతడు బైక్ల దొంగ. అరెస్ట్ అయ్యి, జైలులో ఉన్నాడు. దీంతో తన విలాసాలకు డబ్బు కావాలని ఆలోచించి, నకిలీ పోలీస్ అవతారం ఎత్తింది. గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో పనిచేస్తున్నానంటూ చెప్పుకుంది.
ఈ క్రమంలోనే లంగర్హౌస్లో నివాసం ఉండే రాకేశ్ నాయక్తో పరిచయమైంది. అతడికి నాంపల్లి కోర్టులో సీనియర్ అడ్వకేట్ వద్ద అసిస్టెంట్గా ఉద్యోగం ఇప్పిస్తానని, నెల కు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు జీతం ఉంటుందని నమ్మించి, రూ.30 వేలు వసూలు చేసింది. తర్వాత కనిపించకుండా పోవటంతో రాకేశ్కు అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం తెలిసింది. వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అశ్వినిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణకు లంగర్హౌస్ పోలీసులకు అప్పగించారు.