మాతాశిశు మరణాల నివారణ కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్’ పథకం దేశానికే ఆదర్శంగా ఎందుకు నిలిచిందో తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ప్రధాన మంత్రి మాతృవందన యోజన’ (పీఎంఎంవీవై) పథకం కన్నా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ రెట్టింపు స్థాయిలో ప్రయోజనకారిగా ఉన్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తొమ్మిదేండ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ గురువారం ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. పీఎంఎంవీవై పథకం కింద దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.11 కోట్ల మంది గర్భిణులు సాయం పొందినట్టు పేర్కొన్నారు. వీరికి కేంద్రం ద్వారా రూ.12,100 కోట్ల ప్రయోజనం కలిగినట్టు వెల్లడించారు. ఈ లెక్కన సగటున ఒక్కో గర్భిణికి అందించిన సాయం రూ.3,890. ఈ పథకం ఫలితంగా దవాఖాన ప్రసవాలు 94.8 శాతానికి పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేసీఆర్ కిట్తో 13.90 లక్షల మందికి లబ్ధి
రాష్ట్రంలో కేసీఆర్ కిట్ ద్వారా ఇప్పటివరకు 13.90 లక్షల మంది గర్భిణులు ప్రయోజనం పొందారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1261 కోట్ల ఆర్థిక సాయం అందించింది. కేసీఆర్ కిట్ ద్వారా సగటున ఒక్కో గర్భిణికి రూ.9,079 సాయం అందింది. కేంద్రం సాయంతో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వం రూ.5,189 అధికంగా సాయం అందించింది. ఇది కేంద్రం సాయం కన్నా 133 శాతం అధికం.
ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు
రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకం కింద ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, బాబు పుడితే రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నది. రిజిస్ట్రేషన్ సమయంలో, ఏఎన్సీ చెకప్స్ తర్వాత, ప్రభుత్వ దవాఖానలో ప్రసవం, పిల్లలకు టీకాలు వేయించిన తర్వాత.. ఇలా విడతలవారీగా నగదు జమ అవుతున్నది.