తెలంగాణ రాష్ట్రంలో ‘రైతుబీమా’ తరహాలో ‘గీతకార్మికుల బీమా’ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గీతకార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం ఆయన మంత్రులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గీత కార్మికుల బీమా పథకంపై చర్చించారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కల్లుగీస్తూ దురదృష్టకర సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు.
ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందిస్తున్నా.. బాధితులకు పరిహారం అందడంలో ఆలస్యం అవుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతు బీమా తరహాలోనే కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారంలోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను రూపొందించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను ఆదేశించారు.