దేశంలో రోజుకి నాలుగు వేల మంది సడన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఈ కారణంతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన CPR శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సడన్ కార్డియాక్ అరెస్టుకు, హార్ట్ ఎటాక్కు మధ్య తేడా ఉందని చెప్పారు. మనిషి అప్పటికప్పుడు కుప్పకూలడమే కార్డియాక్ అరెస్ట్ అని, అప్పుడు చేసేదే సీపీఆర్ అని ఆయన తెలిపారు.
అయితే, ఈ సీపీఆర్పై అవగాహన కేవలం 2 శాతం మందికే ఉందని, 98 శాతం మందికి అవగాహన లేకపోవడంతో చాలామంది కార్డియక్ అరెస్టుతో చనిపోతున్నారని మంత్రి హరీశ్రావు చెప్పారు. అందుకే ఇప్పుడు కార్డియాక్ అరెస్టుపై అవగాహన కలిపిస్తున్నామన్నారు. సీపీఆర్ చేయడానికి పెద్ద చదువు అవసరం లేదని, అవగాహన ఉంటే చాలని చెప్పారు. EMR నుంచి శిక్షణ ఇచ్చి వారిని జిల్లాలకు పంపుతున్నట్లు తెలిపారు. అన్ని శాఖల సిబ్బందికి సీపీఆర్పై శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు.సీపీఆర్ కాకుండా AED పరికరంతో కరెంట్ షాక్ ఇచ్చి కూడా సడన్ కార్డియాక్ అరెస్టు అయిన వారికి ట్రీట్మెంట్ చేస్తారని మంత్రి తెలిపారు.
అయితే సీపీఆర్ అయినా, షాక్ ట్రీట్మెంట్ అయినా కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో జరగాలని చెప్పారు. రాష్ట్రంలో రూ.1500 కోట్లతో 1200 AED మిషన్లను కొనాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మారిన ఆహారపు అలవాట్లవల్ల కార్డియాక్ అరెస్టులు పెరిగాయని, కరోనా తర్వాత కూడా ఇవి ఎక్కువ సంభవిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉండాలని, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా CPR పై అవగాహన కలిగి ఉండాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతోపాటు, జిల్లా కలెక్టర్ హరీష్, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్, పోలీస్, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.