ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘మీరు మంచి పనిచేస్తే ఎవరూ పొగడరు. కానీ, చిన్న తప్పు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మా పరిస్థితి కూడా అంతే. ఎంత మంచి చేసినా ఎవరూ గుర్తించరు కానీ.. తప్పులు అందరూ గుర్తిస్తారు. మహిళా కెమెరామెన్, జర్నలిస్టు విధులు చాలా కష్టమైనవి. మహిళల కోసం వీహబ్ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం అందుబాటులోకి తెస్తున్నారు. మీడియా రిలేటెడ్ స్టార్టప్ పనులు చేయాలనుకునే వారికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు తప్పు చేసినప్పుడు చీల్చి చెండాడండి. దాంతో పాటు ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను కూడా ప్రజలకు తెలియజేయండి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్య సేవలు అందిస్తున్నాం.
మాతా శిశుమరణాలు తగ్గాయి, నిమ్స్లో అత్యధిక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేశాం. మా తప్పులు ఎంత కవర్ చేస్తారో.. పాజిటివ్ న్యూస్కు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వండి. దుర్ఘటనలు జరిగినప్పుడు మాకు బాధ్యత లేదన్నట్టు మాట్లాడటం సరికాదు. రాష్ట్రంలో ఉన్న మహిళా జర్నలిస్టులు అంతా కలిసి ఒక యూనియన్గా ఏర్పడి… మీ సమస్యలను ఐఅండ్పీఆర్ శాఖకు తెలపాలి’’ అని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వ సత్కారం అందుకున్న మహిళా జర్నలిస్టులకు అభినందనలు తెలిపారు.