ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కందుకూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట సందర్భంగా ఎనిమిది మంది మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఈ సంఘటనకు ఓ ప్రధానమైన కారణం ఉంది అని పోలీసులు తెలిపారు. కందుకూరు తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభలో తొక్కిసలాట ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని డీఐజీ త్రివిక్రమ వర్మ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు తమ అనుమతి తీసుకున్నప్పటికీ 46 మీటర్లు ముందుకెళ్లి రోడ్ షో చేయడం వల్ల ఇరుకైన సందుల్లో భారీగా జనం పోగయ్యారని వెల్లడించారు. బాణాసంచా కాల్చడం, ఫ్లెక్సీలు, భారీ స్పీకర్లు ఏర్పాటు చేయడమూ ప్రమాదానికి కారణమని చెప్పారు. అయితే మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలస్యంగా వచ్చారని, ఆయనతో ఫొటోల కోసం ప్రజలు దూసుకొచ్చారని తెలిపారు.
