తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర మహిళ,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని గీసుగొండ మండలం కొనాయిమాకుల గ్రామంలో రూ.87.45 లక్షల వ్యయంతో బాలసదనం భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆధునిక వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రం, రూ.7.71 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు ఆమె లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పల్లెల్లో మౌలిక వసతులు పెరిగాయని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పల్లెలు కళకళలాడుతున్నాయని అన్నారు.
గ్రామీణ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ బీ.గోపి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు