సికింద్రాబాద్లోని రూబీ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మరణించగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. తాజాగా మరో వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. మరణించినవారు, గాయపడిన వారిలో ఏపీ వాసులు ఉన్నారు. గాయపడిన వారిని సిటీలోని అపోలో, యశోద హాస్పిటల్స్కి తరలించారు.
మృతులు వీరే..
ఈ ఘటనలో విజయవాడ రామవరప్నాడుకు చెందిన అల్లాడి హరీశ్(33), దిల్లీకి చెందిన వీరేంద్రకుమార్ (50), రాజీవ్ మైక్ (26), సందీప్ మాలిక్, చెన్నైకి చెందిన సీతారామన్ (48), బాలాజీ (58) మృతి చెందిన్లు గుర్తించారు. ఓ మహిళ సహా మరో ఇద్దరి వివరాలు ఇంకా తెలియలేదు.
క్షతగాత్రులు
పెందుర్తికి చెందిన సంతోష్ (26), యోగిత (26) ఈమె మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుంది. జయంత్ (39) బెంగళూరుకు చెందన ఈయన అపోలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈయన పరిస్థితి విషమంగా ఉంది. కోల్కతాకు చెందిన దేబాశిష్ గుప్తా (36), చెన్నైకి చెందిన కేశవన్ (27), ఈయన ముంబయిలో ఇంజినీర్గా పనిచేస్తున్నారు. దీపక్ యాదవ్ (38) క్వాలిటీ ఆఫీసర్గా హరియాణాలో పనిచేస్తున్నారు. ఉమేశ్ కుమార్ (35) కోల్కతాలో మార్కెటింగ్ మేనేజర్, రాంనగర్కు చెందిన మన్మోహన్ ఖన్నా (48), గుజరాత్కు చెందన రాజేశ్ జగదీశ్ (49)లు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అసలేం జరిగిందంటే..
సోమవారం రాత్రి సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయం సమీపంలోని రూబీ లగ్జరీ ప్రైడ్ పేరిట ఉన్న అయిదంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్లోని సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ఉంది. మిగిలిన నాలుగు ఫ్లోర్స్లో హోటల్ నిర్వహిస్తున్నారు. రాత్రి 9.40 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇది జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. వేడికి షోరూంలోని ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలాయి. దీనివల్ల మంటల ఉద్ధృతి మరింత పెరిగింది. సమీపంలోని అన్ని వాహనాలకు మంటలు వ్యాపించడంతో పెద్దఎత్తున ప్రమాదం జరిగింది. మెట్ల రూట్ నుంచి పైఅంతస్తులకు వ్యాపించాయి. దీనికితోడు వాహనాలు, బ్యాటరీల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. ఊపిరి ఆడక లాడ్జిలో వసతి పొందుతున్న ఏడుగురు పర్యాటకులు మృతి చెందారు. తాజాగా మరొకరు చనిపోయారు.
స్ప్రింక్లర్లు పనిచేయలేదు: అగ్నిమాపక శాఖ డీజీ
ఈ ప్రమాదంపై అగ్నిమాపక శాఖ అదనపు డీజీ సంజయ్ కుమార్ స్పందిస్తూ.. పొగ వల్లే 8 మంది మృతిచెందారు. రూబీ ప్రైడ్ భవనానికి 4 అంతస్తుల నిర్మాణానికి మాత్రమే జీహెచ్ఎంసీ అనుమతి ఉంది. కానీ అదనంగా మరో అంతస్తు నిర్మించారు. సెల్లార్లో కేవలం పార్కింగ్ మాత్రమే చేయాలి. ఈ భవనంలో విద్యుత్ వాహనాల విక్రయాలు చేస్తున్నారు. లాడ్జిలో స్ప్రింక్లర్లు ఉన్నాయి. మంటలు వచ్చినప్పుడు మాత్రమే అవి తెరుచుకుంటాయి. ఈ ప్రమాదంలో మంటలు ఎక్కువగా రావడంతో అవి పనిచేయలేదు. లోపలికి వెళ్లడానికి, బయటికి రావడానికి ఒకే వే ఉంది. దీనివల్ల ప్రమాదం జరిగినప్పుడు బయటికి ఎవరు రాలేకపోయారు అని చెప్పారు.