భిన్నత్వంలో ఏకత్వం.. ఇదే భారతదేశం ఆత్మ. సుదీర్ఘ పరాయి పాలనను తుదముట్టించి 75 ఏండ్ల కింద బహుళపార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థగా అవతరించిన భారత్.. ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి అత్యుత్తమ ఉదాహరణగా కొనసాగుతున్నది. అందువల్లే జాతీయ, ప్రాంతీయ పార్టీలతోపాటు.. చిన్న చిన్న పార్టీలు సైతం మనగలుగుతున్నాయి. ఇంతటి విశిష్ట భారతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతున్నదనే విమర్శలున్నాయి అంటూ తాజాగా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు ఈ విమర్శలు నిజమేనని రుజువు చేస్తున్నాయి. దేశంలో బీజేపీ తప్ప ఏ పార్టీ మిగలదని నడ్డా పెడుతున్న శాపనార్థాలు భారత ప్రజాస్వామ్యానికే పెను ముప్పుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమెరికా వంటి రెండు పార్టీల ప్రజాస్వామ్యంలోనే మూడో పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుంటే.. అతి పెద్ద ప్రజాస్వామ్యంగా ఘనతకెక్కిన భారత్లో ఏక పార్టీ వ్యవస్థను తీసుకురావాలన్న ఆలోచనల దిశగా ఆ పార్టీ సాగుతున్నదనేందుకు నడ్డా హూంకరింపులే నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కేంద్ర పార్టీ ఒకలా ఆలోచిస్తే రాష్ట్ర పార్టీగా తాము మరోలా ఎందుకు ఆలోచిస్తామనే పద్ధతుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 15 సీట్లు కూడా రావని, వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి టీఆర్ఎస్సే ఉండదని శనివారం మీడియా చిట్చాట్లో చెప్పిన మాటలు కూడా ఇదే కోవలోకి వస్తాయని పలువురు అంటున్నారు.
ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన పార్టీని అల్లకల్లోలం చేసి, ఆ పార్టీలో చీలిక తేవడం ద్వారా దొడ్డి దారిన అధికంలోకి వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కుట్రలతో, కుతంత్రాలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ద్వారా దేశ రాజకీయ అస్థిత్వాన్నే ప్రమాదంలోకి బీజేపీ నెడుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
బీజేపీ ముసుగు తీసేసిన నడ్డా
ఒక ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడపాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడటానికి ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. కానీ.. ఇదంతా లేకుండా ఒక్క బీజేపీ మాత్రమే దేశంలో ఉండేలా.. ఏక పార్టీ వ్యవస్థను తీసుకువచ్చే కుట్రల్లో భాగంగానే ఆ పార్టీ నాయకుల మాటలు ఉంటున్నాయి. ఈ క్రమంలోనే భారతదేశాన్ని బీజేపీ ఎటువైపు నడిపించాలని భావిస్తున్నదో ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా స్పష్టంచేశారు. ఒకరకంగా ఇంతకాలం బీజేపీ వేసుకొన్న ముసుగును ఆయన తొలగించారు.
దేశంలో బీజేపీ ఒక్కటే మిగలబోతున్నదని, ఇతర రాజకీయ పార్టీలన్నీ అతిత్వరలో ధ్వంసమైపోతాయని నడ్డా ఆదివారం శాపనార్థాలు పెట్టారు. ఇతర పార్టీల్లో 30 ఏండ్లు పనిచేసిన సీనియర్ నేతలు కూడా బీజేపీలో చేరుతున్నారని బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ‘జాతీయ స్థాయిలో ఏ ఒక్క పార్టీ బీజేపీని ఎదుర్కొని నిలబడలేదు.
దేశంలో బీజేపీ మాత్రమే ఉంటుంది. ఇతర పార్టీలన్నీ త్వరలోనే ధ్వంసమైపోతాయి. మా పార్టీకి ఉన్నట్టు కాంగ్రెస్కు ఎలాంటి ప్రాంతీయ ఆకాంక్షలు లేవు. అందుకే ఆ పార్టీ దక్షిణాదిలో కూడా అంతరించిపోతున్నది. బీజేపీ ఒక సిద్ధాంతంపై ఆధారపడి నడుస్తున్నది. బీజేపీకి పార్టీ ఆఫీసులే శక్తి కేంద్రాలు’ అని అన్నారు. బీజేపీతోనే దేశంలో మార్పు సాధ్యమని నడ్డా తెలిపారు. ‘ఇతర పార్టీల్లో 20-30 ఏండ్లు పనిచేసినవారు కూడా అన్నీ వదిలేసి మా పార్టీలో చేరుతున్నారు. ఎందుకంటే దేశంలో బీజేపీతో మాత్రమే మార్పు సాధ్యమని అందరూ నమ్ముతున్నారు’ అని చెప్పారు.
ఎనిమిదేండ్లుగా ఇదే పని
నిజానికి మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఆ పార్టీ భారత ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను పూర్తిగా మార్చేసే పనిలోనే ఉన్నదని రాజకీయ పండితులు మొత్తుకొంటున్నారు. మోదీ ప్రధాని కాగానే రాష్ర్టాలకు మొదట ఇచ్చిన సందేశం సహకార సమాఖ్యగా పనిచేద్దామని.. కానీ, నిత్యం అందుకు విరుద్ధమైన పనులే చేస్తున్నారు.
గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అనేక చికాకులు సృష్టించిన ఉదంతాలు కండ్ల ముందటే ఉన్నాయి. అంతకంటే ప్రమాదకర కుట్ర ఇతర పార్టీలను చీల్చటం. ఇప్పటికే పదుల రాష్ర్టాల్లో అధికార పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూలదోసి, బీజేపీ అధికారంలోకి వచ్చిన వాస్తవం 140 కోట్ల భారతీయులకు తెలిసిందే. ఇదంతా ఇతర పార్టీలను బలహీనపర్చి క్రమంగా అవి అంతరించిపోయేలా చేసే కుట్రలో భాగమని మేధావులు అంటున్నారు.
దేశాన్ని సుదీర్ఘకాలం ఏలిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో ఆరిపోతున్న దీపంలా తయారైంది. ఈ పరిస్థితి కూడా బీజేపీ బాగా కలిసి వస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార వికేంద్రీకరణ అంటూ తియ్యని మాటలు చెప్తున్న కేంద్రప్రభుత్వ పెద్దలు, ఆచరణలో మునుపెన్నడూ లేనంతగా అధికార కేంద్రీకరణకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి.
జీఎస్టీనే అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనూ బీజేపీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తున్నది. రాష్ర్టాల అధికారాలు హక్కులను క్రమంక్రమంగా లాగేసుకొంటూ దేశాన్ని ఏకకేంద్ర రాజ్యంగా మార్చేస్తున్నదని రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే నడ్డా వ్యాఖ్యలు నిజమవుతాయని, దేశంలో బహుళ పార్టీ వ్యవస్థ అంతరించి ఏకపార్టీ వ్యవస్థ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.