శ్రీలంకలో పూర్తిగా దిగజారిన ఆర్థిక పరిస్థితులు, ఆ దేశంలో నెలకొన్న సంక్షోభం అక్కడి సామాన్యులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రోజురోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరడంతో ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తమ ప్రతాపాన్ని నేరుగా అధ్యక్షుడిపైనే చూపించారు.
శనివారం లక్షలాది మంది ప్రజలు కొలంబోలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. ఆర్థిక సంక్షోభంతో నరకాన్ని అనుభవిస్తున్న ప్రజలు..మహోగ్రరూపంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నివాసానికి సునామీలా పోటెత్తారు. అధ్యక్ష భవనంపైకి రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో కొలంబో వీధులు రణరంగాన్ని తలపించాయి.
ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన రాజపక్స అధ్యక్ష భవనాన్ని విడిచిపెట్టి సీక్రెట్గా నౌకలో పరారయ్యారు. ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఈనెల 13న అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు ఆయన అంగీకరించారు.