తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గన్పార్కులోని అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్తో పాటు పెద్దఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పోతున్నారు అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాల్సిందే అని మంత్రి తలసాని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అయినా ఇచ్చారా? ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటే కుక్కల్లా మోరిగిన బీజేపీ నేతలు ప్రధాని వ్యాఖ్యలపై ఏం సమాధానం చెప్తారు? అని నిలదీశారు. ప్రధాని క్షమాపణలు చెప్పే వరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చిచెప్పారు.