ప్రతి జిల్లాకు పార్టీ కార్యాలయంలో భాగంగా జనగామ టీఆర్ఎస్ పార్టీ జల్లా కార్యాలయం త్వరలోనే ప్రారంభం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో మిగతా జిల్లాల పార్టీ కార్యాలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్నాయని ఆయా కార్యాలయాలను సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గార్ల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిపిస్తామని మంత్రి తెలిపారు.
జనగామ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తో కలిసి సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యాలయాలను చూశారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాళోజీ, జ్యోతిరావు ఫూలే, సావిత్రి ఫూలే విగ్రహాలను పరిశీలించారు. కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డట్లు తెలిపారు.
త్వరలోనే సీఎం గారితో మాట్లాడి మరో డేట్ తీసుకుంటామని తెలిపారు. పార్టీ కార్యాలయాలు ప్రారంభమైతే పార్టీ కార్యకలాపాలన్నీ అందులోనే జరుపుకునే వీలు కలుగుతుందన్నారు. పార్టీ శ్రేణులకు కూడా అనుకూలంగా ఉంటుందన్నారు. పార్టీ కార్యాలయాలు సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో నిర్మిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.