భారతదేశం వేల సంవత్సరాలుగా వ్యవసాయ నాగరికతకు పుట్టినిల్లు. వ్యవసాయం వృత్తిగానే కాదు వ్యవసాయమే జీవనాధారంగా వృద్ది చెందినటువంటి ప్రత్యేక నాగరికత మనది . ఈ వ్యవసాయం, అనుబంధ వృత్తుల నుండే శ్రమ పుట్టింది. శ్రమ నుండి విలువలు పుట్టాయి. విలువల నుండి జీవితాలు నిలబడ్డాయి. తరతరాలకు అవి అనువంశికంగా వస్తున్నాయి. క్రమంగా ఈ రంగంలో ఉండే అవస్థలు , ఈ రంగం మీద పెట్టే దృష్టి ఎట్లయితే తగ్గుతూ వచ్చిందో … అదే క్రమంలో సమాజంలో విలువలు మరోరూపం సంతరించుకుంటున్నాయి. ఒకనాడు 33 శాతం మంది వ్యవసాయరంగం మీద ఆధారపడిన అమెరికాలో నేడు కేవలం రెండు శాతం మంది మాత్రమే ఆ రంగంలో పరిమితమయ్యారు. ఇతర రంగాలలో అమెరికా బలంగా ఉన్న నేపథ్యంలో అది బయటకు గొప్పగా కనిపిస్తుండ వచ్చు. అమెరికాలో ఉన్న ఆర్థిక వనరులు కూడా అది కనిపించకపోవడానికి కారణం కావచ్చు. పేద దేశాలలో ఉన్న సహజ వనరులను కొల్లగొట్టడం మూలంగా అమెరికాకు మేలు జరగవచ్చు. ప్రపంచంలో అమెరికా తర్వాత వ్యవసాయ భూమి విస్తీర్ణంలో రెండో స్థానం, పంటల ఉత్పత్తిలో మూడోస్థానంలో భారతదేశం ఉన్నది. ఇప్పుడు దాదాపు 60 శాతం జనాభా ఆధారపడిన భారత్ లాంటి వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన దేశంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు. కొత్త సమాజం శ్రమకు దూరమవటం ద్వారా విలువలకు దూరమైపోయి, శ్రమను గౌరవించలేనటువంటి పరిస్థితిలో మానవ విలువలు తరిగిపోతున్నాయి. సుఖమయమయిన జీవితమే జీవితం అనుకునే ఒక భ్రమలో ప్రపంచం ముందుకు సాగుతున్నది. ఆ క్రమంలోనే దేశంలో ఒక వెలుగు వెలిగిన హైదరాబాద్ రాష్ట్రం సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాత పడ్డ అవస్థలు అందరికీ విదితమే.
సమైక్య పాలకుల వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాల మూలంగా బోర్లమీద ఆధారపడిన వ్యవసాయం, కరంటు సరఫరా లేక తిప్పలు. వలసలు పోయి చనిపోయిన రైతులు, పురుగుల మందునే పెరుగన్నంలా తిని చనిపోయిన రైతులు, తుమ్మ కొయ్యలకు ఉరి వేసుకుని చనిపోయిన రైతులు, కరంటు షాక్ తగిలి చనిపోయిన రైతులు. తదితర సంక్షోభాలతో రైతుల జీవితం కకావికలం అయింది. ఆ సమస్యల నుండి పుట్టుకొచ్చిందే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, ఉద్యమం. అనేక రకాల అభిలాషలకు, ఆకాంక్షలకు ప్రతి రూపంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టి కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్లు ఉద్యమించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. దాని ఫలితాలు ఇప్పుడు మనందరం చూస్తున్నాం. మరొక్కసారి వ్యవసాయాన్ని పునంప్రతిష్టించడం, విలువలను పునంప్రతిష్టించడం. శ్రమను, చెమట చుక్కను గౌరవించడంతో నేడు తెలంగాణ మరొక్కసారి భారతదేశానికి పరిచయమవుతున్నది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 60 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వ్యవసాయరంగం మీద దృష్టిసారించారు. సంక్షోభ ఊబి నుండి రైతుల్ని బయటకు తీసుకొచ్చారు. సాగునీటి సదుపాయాలను పెంచుతూనే ఒకప్పుడు వ్యవసాయానికి దూరమయిన వారిని తిరిగి ఈ రంగం వైపుకు ఆకర్షించేందుకు రుణమాఫీ, సాగుకు ఉచితంగా 24 గంటల కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలు అందించడంతో పాటు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచి సకాలంలో మద్దతుధరకు కొనుగోళ్లు చేయడం మూలంగా రైతాంగంలో విశ్వాసం పెరగడంతో వ్యవసాయం పట్ల భరోసా కలిగింది.
దాని ఫలితంగా తెలంగాణ వచ్చేనాటికి విస్తీర్ణ యోగ్యమైన భూమి 1 కోటి 31 లక్షల ఎకరాలు. కానీ నేడు (2020-21 నాటికి ఉద్యానశాఖ తో కలిపి) 2 కోట్ల 15 లక్షల ఎకరాలు. అంటే 84 లక్షల ఎకరాల నూతన సేధ్యాన్ని మనం సాధించాం. ఏడేండ్ల కాలంలో సాగువిస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. 2014-15 లో పంటల దిగుబడి 154.16 లక్షల టన్నులు ఉండగా, 2020-21 నాటికి (120.55 % వృద్ధి) 185.84 లక్షల టన్నులు పెరిగి 340.00 లక్షల టన్నులకు చేరుకున్నది. రైతులను సంఘటితం చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షా 61 వేల మంది రైతులతో రైతుబంధు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒకటి చొప్పున 2601 రైతువేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1.8 శాతం వృద్ధిరేటు మాత్రమే తెలంగాణలో నమోదైంది. 2020-21 నాటికి 6.3 శాతం అదనపు వృద్ధి సాధించి 8.1 శాతం నమోదు చేయగలిగింది. రాష్ట్ర స్థూల ఆదాయంలో మన వ్యవసాయ వాటా 21 %. 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,12,162 ఉండగా 2020-21 నాటికి 103.46 % వృద్ధి చెంది రూ. 2,28,216 కు చేరుకున్నది. ఇది వ్యవసాయ అభివృద్ధి వల్ల ప్రధానంగా జరిగింది.
వ్యవసాయం ద్వారా వృత్తులు, ఉపాధులు మాత్రమే కాదు, గ్రామాలు బాగుపడ్డాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది. ప్రకృతిపరంగా కూడా ఈ రోజు మానవాళి ఎదుర్కొంటున్న రెండు పెనుముప్పులు ఒకటి టెర్రరిజం. రెండు పర్యావరణం సమస్య. టెర్రరిజం రాజకీయంగా, ఆర్థికంగా ఎదుర్కోవాల్సిన అంశం అయితే, పర్యావరణం అనేది పాలకులు దేశదేశాలలో ఒక నిబద్దతతో, దూరదృష్టితో వివిధ రంగాలలో అమలుచేసే కార్యక్రమాల వల్ల పర్యావరణ హితం అవుతుంది. హరితహారం చెట్లు నాటినా, వ్యవసాయం చేసినా, ఉపరితలం మీద ఉండే ప్రాజెక్టులు, కాలువల నీళ్లతో భూగర్భజలం పెరగడం మూలంగా భూమి మీద పచ్చదనం పెరుగుతుంది. దాని పర్యావసానం ఈ ఏడేళ్లకాలంలో తెలంగాణ ప్రభుత్వ చర్యల మూలంగా తెలంగాణలో మూడు డిగ్రీల ఊష్టోగ్రతలు తగ్గిపోయాయి. అటవీశాతం తెలంగాణ వచ్చే నాటికి 20.38 శాతం ఉండగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం మూలంగా 24.05 శాతానికి చేరుకున్నది. ఈ ఏడేళ్లలో 3.67 శాతం అటవీప్రాతం పెరిగింది. ఇది జాతీయ సగటుకన్నా ఎక్కువ. జాతీయ సగటు 21.34 శాతం మాత్రమే కావడం గమనార్హం. తెలంగాణలో 66.65 లక్షల ఎకరాలలో ప్రస్తుతం అటవీప్రాంతం ఉన్నది.
వ్యవసాయాన్ని బలోపేతం చేయడం మూలంగా ప్రజలు ఖాళీగా ఉండకుండా వృత్తులు, ఉపాధులలో నిమగ్నమయ్యారు. వ్యవసాయం ప్రత్యక్ష ఉపాధి మాత్రమే కాకుండా పలురకాల పరోక్ష ఉపాధులకు తావిచ్చింది. గత ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులు నిర్మించడం మూలంగా, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేపపిల్లలను పంపిణీ చేయడం మూలంగా తెలంగాణలో మత్స్యసంపద అనూహ్యంగా పెరిగింది. 2016 – 17 లో 1,93,732 మెట్రిక్ టన్నులు ఉన్న చేపల ఉత్పత్తి 2020 – 21 నాటికి 3,49,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. రూ.1356.12 కోట్ల విలువ ఉన్న మత్స్య సంపద రూ.3,141 కోట్లకు చేరుకోవడం గమనించదగ్గ విషయం. ఇక సబ్సిడీ మీద తెలంగాణ ప్రభుత్వం 79.16 లక్షల గొర్రెపిల్లలను పంపిణీ చేయగా, వాటికి 1.30 కోట్ల పిల్లలు పుట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటి విలువ ప్రస్తుతం రూ.7800 కోట్లు అని అంచనా.
సాగునీటి రాకతో తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలకు వలసలు బాగా తగ్గిపోయాయి. ఇంతకుముందు ఈ రంగాన్ని వదిలి ఇతర రంగాలలో ఉపాధులు వెతుక్కున్న వారు తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. వ్యవసాయ కూలీల డిమాండ్ పెరిగి ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ గ్రామాలకు కూలీలు ఉపాధి కోసం వలస వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో సంపద అవకాశాలు పెరిగిన నేపథ్యంలో ఆటోమోబైల్, ద్విచక్ర, కార్ల షోరూంలు, ఆహారరంగాలలో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. 2014-15లో 94,537 వ్యవసాయ ట్రాక్టర్లు తెలంగాణలో అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 2.14 లక్షలకు చేరాయి. 2014-15లో 6,318 హార్వెస్టర్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం 14,483 లకు చేరాయి.
మరో అధునాతన కంప్యూటర్ కనుక్కుని విజయాలు సాధించినా, ఒక రాకెట్ ను కనుక్కుని చంద్రమండలానికి వెళ్లినా, రేపు రాబోయే రోజులలో మరింత సాంకేతికతను సంతరించుకుని సూర్య గ్రహానికి వెళ్లినా .. ఇలా ఏది జరిగినా భూ ఉపరితలం మీద ఉన్న మానవాళి మాత్రమే కాదు సకల జీవరాశులు అన్నీ ఏదో రకమయిన ఆహారాన్ని పొందాల్సిందే. జీవకోటికి కావాల్సిన ఆహారం 90 శాతం వ్యవసాయరంగం నుండి ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయం జరగడం ద్వారానే వస్తుంది. ఇంత ఉత్కృష్టమయిన ఈ వృత్తిని పెంపొందించడం పాలకుల బాధ్యత. ఇది ఏ పనీ రానివాళ్లే వ్యవసాయం చేయాలన్న ఒక దురవస్థ నుంచి .. ఒక సగటు గ్రామీణుడి నుంచి దేశ అత్యున్నత వ్యక్తి వరకు ప్రత్యక్ష్యంగా వ్యవసాయరంగం పట్ల మక్కువ కలిగి అందులో ఏదో ఒకరకంగా లీనం కావాల్సిన ఆవశ్యకత ఉంది. భూసారాన్ని పెంచుకుంటూ సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తరించాలి. నాణ్యమైన, బలవర్దకమయిన ఆహారం అందరికీ లభించేట్లు కృషిచెయ్యాలి.
సర్వ ఉపాధులు, సర్వ వృత్తులలో ఉన్న వారు కూడా పండ్ల మొక్కలు, కూరగాయల మొక్కలు సొంత జాగలు కావచ్చు .. ఇండ్ల వద్ద పెరళ్లలో కావచ్చు .. ఇండ్ల మీద కావచ్చు ఏదో ఒక రకంగా సాగుకు శ్రీకారం చుట్టాలి. ఈ వ్యవసాయ రంగం మీద మక్కువ తగ్గి ఇతర రంగాల మీద ఆకర్షణలు పెరిగితే ఇప్పుడున్న కొత్తతరం అయినా, రాబోయే భవిష్యత్ తరం అయినా ఈ వృత్తికి దూరం అయితే, ఈ రంగం మీద వారికి అవగాహన లేకపోతే అది అరిష్టానికి దారి తీస్తుంది. వ్యవసాయం చేసే వాళ్లు తక్కువై తినేవాళ్లు ఎక్కువై సమతుల్యత లోపిస్తుంది. వ్యవసాయ రంగం వైపు కొత్త తరం దృష్టి సారించనట్లయితే భవిష్యత్ లో రైతులు అనే వారిని మ్యూజియంలలో చూడాల్సి వస్తుంది.
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు
జాతీయ రైతు దినోత్సవం సంధర్భంగా
Post Views: 4,262