ప్రధాని నరేంద్రమోదీ రేపు గోవాకు వెళ్లనున్నారు. గోవాలో జరుగనున్న గోవా లిబరేషన్ డే ఉత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. గోవాలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జి స్టేడియంలో గోవా లిబరేషన్ డే సంబరాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా భారత భూభాగాలైన గోవా, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాల విముక్తి కోసం పోరాడిన వారిని, 1961లో ఆపరేషన్ విజయ్లో పాల్గొన్నవారిని ప్రధాని మోదీ సత్కరించనున్నారు.
భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా గోవా, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాలు పోర్చుగీస్ ఆధీనంలోనే ఉండేవి. వాళ్ల నుంచి ఆయా ప్రాంతాలను విముక్తం చేయడం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. చివరికి 1961లో భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో పోర్చుగీస్ నుంచి గోవాను విముక్తం చేసింది.