స్వచ్ఛ భారత్ మిషన్లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ కృషి ఫలితమని మంత్రి అన్నారు. దేశంలోనే వినూత్నంగా కెసిఆర్ చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్లో లభించిన 9 అవార్డులకు తోడు రాష్ట్రాల క్యాటగిరీ, సఫాయి మిత్ర సురక్ష, గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగాల్లో మరో 3 అవార్డులు దక్కాయి. సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్లో భాగంగా రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణను ఎంపికచేశారని, ఇదే విభాగం కింద మూడు లక్షల జనాభా కంటే తక్కువ ఉన్న పట్టణాల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంపికైందని, కాగా గ్రేటర్ హైదరాబాద్… గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగంలో ఎంపికైందని మంత్రి వివరించారు.
ఇప్పటికే మన పథకాలను అనుకరిస్తూ, అనుసరిస్తూ, అనేక అవార్డులు, రివార్డులు ఇస్తున్న కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం, మన రాష్ట్రం పట్ల కక్ష పూరిత వివక్ష చూపిస్తున్నది. అభినందనలు తప్ప నిధులు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా తగినన్ని నిధులు ఇచ్చి, మన రాష్ట్రానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.