టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ భవన్లో మోత్కుపల్లికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సమాజానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మోత్కుపల్లి నర్సింహులు. ప్రజా జీవితంలో ఆయనకంటూ ఒక స్థానం ఉంది. విద్యార్థి దశ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించడమే ఆకకుండా అణగారిన ప్రజల వాయిస్గా ఉన్నారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనకు అత్యంత సన్నిహిత మిత్రులు. నాతో అనేక సంవత్సరాలు కలిసి పని చేశారు. వారి వెంట ఎంతో అభిమానంతో వచ్చిన వారందరికీ హృదయపూర్వకమైన స్వాగతం తెలుపుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ సమాజం అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించింది. చాలా బాధలు పడ్డాం. చాలా అనుభవించాం. ఒకప్పుడు నర్సింహులు కరెంట్ మంత్రిగా ఉండే. నేను ఆయనను కలిసినప్పుడు కరెంట్ బాధలు ఉన్నాయని చెప్పిండు. ఆలేరు అంతా కరువు ప్రాంతం. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేసిండు. కరెంట్ కోసం తెలంగాణ ప్రాంతం ఎన్నో కష్టాలు పడ్డది. ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా సేవలందించారు.
ఒకానొక దశలో తెలంగాణ సమాజం చెదిరిపోయింది. ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. నేను మంత్రిగా ఉన్న సమయంలో ఓ సీఎం మాట్లాడుతూ.. తెలంగాణకు పెట్టుబడులు రావు అని అన్నాడు. అప్పుడు నేను గొడవపడ్డాను. తెలంగాణ వస్తే ఏం అభివృద్ధి జరగదని చిత్రీకరించారు. అనేక అవమానాలను తెలంగాణ సమాజం ఎదుర్కొన్నది. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత కూడా అనేక భయభ్రాంతులకు గురి చేశారు. ఆలేరు, భువనగిరి, జనగామ వద్ద మంచినీళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. చాలా భయంకరమైన పరిస్థితి. మంచినీల్లు రావు, కరెంట్ సమస్య.. ఆ పరిస్థితులను ఎదుర్కొన్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు.