ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజవర్గంలోని జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామ బీజేపీ వార్డు మెంబర్లు షాగర్ల మనీష కుమార్, షాగర్ల రజిత శ్రీనివాస్, కనిక జగభాయి నరేష్, కరట్లపెల్లి శ్రీనివాస్ మంత్రి హరీశ్రావు, జమ్మికుంట ఇన్చార్జి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు.
వీరికి మంత్రి హరీశ్రావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అందుకే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో పలుపంచుకునేందుకు అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలస వస్తున్నారన్నారు.
ఈ చేరికలు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు, సంక్షేమ పథకాల అమలుకు నిదర్శనమన్నారు. ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో అర్థం కాలేదన్నారు. ప్రభుత్వ పరమైన శాఖలను ప్రైవేట్ చేస్తున్న బీజేపీలో చేరి ఆత్మగౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు అందరూ సహకరించాలని కోరారు.