తెలంగాణలో ప్రభుత్వ వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న మూడంచెల వైద్య వ్యవస్థ స్థానంలో ఐదంచెల వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. పల్లె దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటుచేస్తూ ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామంలోనే నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రమోటివ్ కేర్ను, జిల్లా పరిధిలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు చర్యలు తీసుకొంటున్నారు.
దేశంలోనే సరికొత్త విధానం..
వైద్యారోగ్య వ్యవస్థలో ఇప్పటి వరకు మూడంచెల వ్యవస్థ కొనసాగుతున్నది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో ప్రైమరీ కేర్, వైద్య విధాన పరిషత్తు పరిధిలో సెకండరీ కేర్, వైద్య విద్య సంచాలకుల పరిధిలో టెర్షియరీ కేర్ వ్యవస్థలు ఉన్నాయి. ఎక్కువగా వైద్యంపై దృష్టి సారించిన గత ప్రభుత్వాలు ఏనాడూ వ్యాధులు రాకుండా, తొలి దశలోనే గుర్తించి అడ్డుకొనే వ్యవస్థపై దృష్టి పెట్టలేదు. ఇలాంటి ప్రయత్నాన్ని దేశంలోనే తొలిసారి తెలంగాణ రాష్ట్రం మొదలు పెడుతున్నది. నగరాలకు మాత్రమే పరిమితమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను జిలా ్ల స్థాయిలోనే ప్రజలకు చేరువ చేసేందుకు సిద్ధమైంది. ఈ రెండు అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ క్షేత్రస్థాయిలో పల్లె దవాఖానలు, రాష్ట్రస్థాయిలో సూపర్ స్పెషాలిటీ దవాఖానలు నెలకొల్పుతున్నది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 100 పల్లె దవాఖానలు మంచి ఫలితాలిస్తున్నాయి. ఇవి ప్రధానంగా మూడు లక్ష్యాలతో పని చేస్తున్నాయి. ప్రమోటివ్ (వ్యాధులబారిన పడకుండా ప్రచారం), ప్రివెంటివ్ (వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు), క్యూరేటివ్ (జబ్బు ముదిరితే పెద్ద దవాఖానలకు పంపటం) పద్ధతిలో ఇవి నాణ్యమైన సేవలందిస్తున్నాయి. మొత్తం 4,830 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చే ప్రక్రియ కొనసాగుతున్నది. వీటన్నింటిలో ఎంబీబీఎస్ వైద్యులను నియమిస్తున్నారు. వీరు పల్లె ప్రజలకు తొలి దశలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నారు. ఇక 5వ అంచెలో భాగంగా నూతనంగా నిర్మించే 8 మెడికల్ కాలేజీలు, హైదరాబాద్, వరంగల్లో ఏర్పాటు చేయబోయే టిమ్స్ దవాఖానల ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 35 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు జిల్లా స్థాయిలోనే ప్రజలకు అందనున్నాయి.
చికిత్స, రోగ నిర్ధారణ పరీక్షలు.. ఈ రెండింటిపైనే ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ పేరుతో పేదలకు అందుతున్న కార్పొరేట్ వైద్యానికి ప్రభుత్వం ఏటా రూ.500 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నది. ప్రజలు, ప్రభుత్వంపై పడుతున్న ఈ భారాన్ని పూర్తిగా తొలగించేలా ప్రభుత్వ వైద్యారోగ్య వ్యవస్థను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించారు. రోగులకు 57 రకాల వైద్యపరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. పల్లె దవాఖానలు అందుబాటులోకి వస్తే పీహెచ్సీకి వెళ్లే పని లేకుండా ఉన్నచోటనే ప్రజలు ఈ పరీక్షలు చేయించుకోవచ్చు. చికిత్స ఖర్చును తగ్గించేందుకు కూడా 5 అంచెల వ్యవస్థ ఉపయోగపడనున్నది.
చేరువ కానున్న సూపర్ స్పెషాలిటీ సేవలు
ఇప్పటివరకు కిందిస్థాయిలో పీహెచ్సీలు ప్రాథమిక వైద్యాన్ని, పై స్థాయిలో టీచింగ్ దవాఖానలు టెర్షియరీ వైద్య సేవలందిస్తున్నాయి. ఇప్పుడు పల్లె దవాఖానలు, సూపర్ స్పెషాల్టీ దవాఖానల ఏర్పాటు నిర్ణయంతో మరో రెండు అడుగులు ముందుకు పడ్డాయి. ప్రాథమిక దశలో రోగాల నిర్ధారణ జరిగితే కింది స్థాయిలో సకాలంలో వైద్యం అందించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ సేవలు పొందటం పేద ప్రజలకు ఎంతో భారంగా మారింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే టిమ్స్ ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే 8 మెడికల్ కాలేజీల్లోనూ సూపర్ స్పెషాల్టీ విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో జిల్లా స్థాయి దవాఖానల్లో కూడా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు అన్ని విభాగాల్లో మెరుగైన వైద్యం అందించడంంలో భాగంగా తీసుకుంటున్న చర్యలు దేశంలో తెలంగాణ తప్ప మరొక్కటి లేదు.
- డాక్టర్ రమేష్రెడ్డి,డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్
కిందినుంచి పైదాకా..
తొలి అంచెలో..: పల్లె దవాఖానలు రోగనిర్ధారణ పరీక్షలు చేసి రోగం ముదరకుండా సకాలంలో వైద్యం అందిస్తాయి. బీపీ, షుగర్ వంటి అసాంక్రమిక వ్యాధుల పట్ల అవగాహన కల్పించి, క్రమం తప్పకుండా మందులు వాడేలా ప్రోత్సహిస్తాయి.
రెండో అంచెలో: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాలియేటివ్ సేవలంటాయి.
మూడో అంచెలో: కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాంతీయ దవాఖానలు సేవలందిస్తాయి. ఇక్కడ పల్లె, పీహెచ్సీలతో పోల్చితే మెరుగైన వైద్య సదుపాయాలు, మరికొన్ని రోగ నిర్ధారణ పరీక్షలు చేసే వెసులుబాటు ఉంటుంది.
నాలుగో అంచెలో: ఈ దశలో జిల్లా, టీచింగ్ దవాఖానలుంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు, రోగాలు ముదిరిన వారికి ఇక్కడ సేవలందుతాయి.
ఐదో అంచెలో..: సూపర్ స్పెషాలిటీ దవాఖానలుంటాయి. కొత్తరకం జబ్బులకు చికిత్స, క్లిష్టతరమైన సర్జరీలు, కింది స్థాయిలో చికిత్స పొందటం వల్ల నయం కాని వారికి ఇక్కడ సేవలందుతాయి. హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో అందుతున్న అత్యున్నత వైద్య సేవలు టిమ్స్ దవాఖానల్లో లభిస్తాయి. వరంగల్లో నిర్మించే రెండువేల పడకల టిమ్స్ ఆసుపత్రి తెలంగాణకు కేంద్రంగా ఉండి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించనున్నది. వివిధ రోగాలు, నివారణ, నూతన చికిత్స విధానాలపై పరిశోధన, అభివృద్ధి సైతం జరుగుతాయి.