సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, అందుకు పేదల ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం చిట్యాల గ్రామంలో రూ.3. 51 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 71 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి.. గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని, అందుకే విశాలమైన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల వంటివి మరే రాష్ట్రంలో లేవని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు ఎలాంటి ఇండ్లు ఇచ్చాయో మనందరికీ తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల ఎంపికను ఎంతో పారదర్శకంగా చేపట్టిందన్న మంత్రి.. లబ్ధిదారులు ఒక్క పైసా కూడా చెల్లించకుండానే ఉచితంగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తుందని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లతో లబ్ధిదారుల ముఖాల్లో సంతోషం కనిపిస్తుందన్నారు.