తెలంగాణ ఎంసెట్ ఫలితాలను (TS EAMCET RESULTS) మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్సైట్లో చూడవచ్చు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈనెల 4, 5, 6 (ఇంజినీరింగ్), 9, 10 తేదీల్లో (వ్యవసాయ, ఫార్మా ఎంసెట్) పరీక్షను నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి 1,47,986 మంది, అగ్రికల్చల్, మెడికల్ స్ట్రీమ్కు 91.19 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం 45 శాతం మార్కుల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే.
30 నుంచి కౌన్సెలింగ్ షూరూ
ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటి విడత ఈనెల 30న ప్రారంభమవుతుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామని, సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవాలని వెల్లడించారు. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్లను కేటాయిస్తామని చెప్పారు. మిగిలిన సీట్లను బట్టి రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటిస్తారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత వ్యవసాయ, ఫార్మా కోర్సుల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.