దళితబంధు పథకానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ. 200 కోట్లు కేటాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. దళితుల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం కింద రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఇప్పటికే దళిత బంధు పథకానికి ప్రభుత్వం తొలి విడత రూ. 500 కోట్లు విడుదల చేసింది. సోమవారం రెండో విడతలో మరో రూ. 500 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఇవాళ మరో 200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ పథకానికి ఇప్పటివరకు రూ. 1200 కోట్లు కేటాయించినట్లయ్యింది.
పథకం అమలుకు రూ. 2 వేల కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ శాలపల్లిలో దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభా వేదికగా ప్రకటించారు. మరో నాలుగైదు రోజుల్లో మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దళిత ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు సైతం దళితబంధు వర్తింపజేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.