సిద్దిపేట జిల్లా చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనo నిర్మిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇవాళ అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ భవన నిర్మాణానికి రూ. 50 లక్షలను మంజూరు చేశామన్నారు. మరో రూ. 75 లక్షలు మంజూరు చేసి.. మొత్తంగా రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో భవనం నిర్మిస్తామని మంత్రి చెప్పారు. రెండున్నరేళ్లలో తెలంగాణలో దళితుల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
వచ్చే సంవత్సరం దళిత బంధు కింద బడ్జెట్ లో రూ.30 వేల కోట్లు కేటాయించాలని ఆర్ధిక శాఖను ఆదేశించామని తెలిపారు. దళితులందరూ ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. రైతు బంధు మాదిరే దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇతర పథకాలను అమలు చేసిన స్ఫూర్తితో దళిత బంధును అమలు చేసి తీరుతామని హరీష్ రావు స్పష్టం చేశారు.