పరిశ్రమల శాఖ కార్యకలాపాల పైన పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు ఈరోజు టి ఎస్ ఐఐసి కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక పార్కుల అభివృద్ధి పైన సమీక్ష జరిపిన కేటీఆర్, అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా నూతన పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన చర్యలను ఇప్పటినుంచే సిద్ధం చేసేలా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తో పనిచేయాలని సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పరిశ్రమలను నగరం బయటకు తరలించేలా జరుగుతున్న ప్రయత్నాలపై కూడా మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశ్రమల తరలింపు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, ఈ దిశగా పరిశ్రమల శాఖలో ఉన్న వివిధ డైరెక్టర్లు తమ పరిధిలోకి ఉన్న పరిశ్రమల తరలింపు వ్యవహారాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారుల బృందం పర్యటించి నగరంలో ఉన్న పరిశ్రమలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రానికి గత ఏడు సంవత్సరాల్లో భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో నూతన పరిశ్రమల్లో తెలంగాణ స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టాలని, ఇందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాల పైన కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పరిశ్రమల శాఖలో ఉన్న వివిధ విభాగాల వారీగా ఆయా డైరెక్టర్లతో రాష్ట్రానికి రానున్న పెట్టుబడి ప్రపోజల్స్, వాటి పురోగతిని చర్చించారు.
ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు టిఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు, పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్, టి ఎస్ ఐ ఐ సి ఎండి వెంకట నరసింహా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.