దక్షిణాదిలో హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుంది అగ్ర నాయిక సాయిపల్లవి. ఎలాంటి పాత్రకైనా న్యాయం చేసే ప్రతిభ కలిగిన నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సొగసరి గత రెండేళ్లుగా తమిళ వెండితెరకు దూరంగా ఉంటోంది. సూర్య సరసన ‘ఎన్జీకే’ తర్వాత ఆమె బిగ్స్క్రీన్పై కనిపించలేదు.
తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి తమిళంలో భారీ సినిమాను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపొందించబోతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ సంస్థ తెరకెక్కించబోతున్నది.
గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుత సమాజంలోని బలమైన సమస్యను చర్చిస్తూ ఈ సినిమా కథాంశానికి రూపకల్పన చేశారని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో ‘లవ్స్టోరీ’ ‘విరాటపర్వం’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాల విడుదల సెకండ్వేవ్ కారణంగా ఆలస్యమైంది.