ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆపద్భాందవుడని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా ఆర్ధిక భరోసా కలుగుతున్నదని అన్నారు. బాధితులు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మిర్యాలగూడ పట్టణంలోని నెహ్రూ నగర్ కు చెందిన శ్రీనివాస్ కు రూ.48వేలు, ఈదులగూడెం కు చెందిన గంగమ్మ కు రూ.60వేలు, అశోకనగర్ కాలనీకి చెందిన శబరీనాథ్ కు రూ. 34వేలు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరయ్యాయి.
మిర్యాలగూడ పట్టణంలోని ఎస్వీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆర్డీవో రోహిత్ సింగ్, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ లతో కలిసి బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను నల్లమోతు భాస్కర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, పెద్ది శ్రీనివాస్ గౌడ్, అన్నభీమోజు నాగార్జున చారి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు