గోదావరి నదీ జలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం గోదావరి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అనంతరం సిరిసిల్ల జిల్లా తెలంగాణ జలకూడలిగా మారిందన్నారు. సిరిసిల్ల సహా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల పరిధిలో ఏ మూలన సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం తేల్చి చెప్పారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి పారుదలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్, రఘోత్తం రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, జెడ్పీ చైర్మన్ ఎన్.అరుణకుమారి, సీఎస్ సోమేష్ కుమార్, సీఎం సెక్రటరి స్మితా సబర్వాల్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సిరిసిల్లా జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్, ఈఎన్సీలు వెంకటేశ్వర్లు, హరిరామ్, నీటిపారుదల అధికారురి శంకర్, తదతరులు పాల్గొన్నారు.
ఏ కాలంలోనైనా పుష్కలంగా నీళ్లు..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ’గోదావరి నదీ జలాలను తెలంగాణ సాగుభూములకు మళ్లించడానికి ప్రాణహితను ఆధారం చేసుకుని కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, రిజర్వాయర్లు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఎన్నో కష్టాలుపడి లిప్టుల ద్వారా సాగునీటిని ఎత్తిపోసుకొని తెలంగాణను సస్యశ్యామలం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రాణహిత నుంచే కాకుండా ఎల్లంపల్లి ఎగువ నుంచి కూడా గోదావరి జలాల లభ్యత పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి జలాలను పూర్తి సామర్ధ్యంతో వినియోగించుకోవాల్సిన అవసరముందన్నారు. కరువు వచ్చినపుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాముఖ్యత మరింత అర్థమవుతదన్నారు. అటువంటి కరువు కష్టాలను అధిగమించడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టు కున్నట్లు చెప్పారు. ఇక నుంచి కరువుకు, కాలానికి సంబంధం లేకుండా ఏ కాలంలోనైనా పుష్కలంగా నీళ్లు లభించేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు.
ఇకపై సాగునీటి సమస్య అనే మాట వినబడొద్దు..
ఇప్పుడు నీళ్ళు మన చేతిలో ఉన్నయ్. వాటిని ఎట్లా వాడుకుంటామనేదే తెలివితో ముడిపడి ఉందన్నారు. నీళ్లను ఎత్తిపోసి నిండుకుండలా జలాశయాలను నిర్మించుకున్న తర్వాత కూడా గోదావరి పరివాహక ప్రాంతాలైన కరీంనగర్, వరంగల్, అదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి సమస్య అనేమాటే వినబడకూడదని సీఎం అన్నారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో గోదావరి జలాలు మూలమూలనా ప్రవహించాలన్నారు. అందుకు చిన్నపాటి లిఫ్టులు ఏర్పాటు చేసుకొని వానాకాలం ప్రారంభంలోనే నదీజలాలను ముందుగా ఎత్తైన ప్రదేశాలకు ఎత్తిపోసుకోవాలన్నారు. ఎత్తు మీదినుంచి తిరిగి గ్రావిటీ విధానం ద్వారా పొలాలకు మళ్లించుకోవాలన్నారు.
కష్టపడి తెచ్చిన.. వాడుకునే బాధ్యత మీదే
మిషన్ కాకతీయ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోని చెరువులు, కుంటలు పటిష్టంగా మారిన నేపథ్యంలో వాటిని ముందుగా గోదావరి జలాలతో నింపుకోవాలన్నారు. ఈ రాడార్ పరిధిలో అన్ని చెరువులను నూటికి నూరు శాతం నింపాలని సీఎం తెలిపారు. కష్టపడి నీళ్లు తెచ్చిపెట్టిన. వాటిని వినియోగించుకునే బాధ్యత మీదేనని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇంజనీర్లకు సీఎం స్పష్టం చేశారు. జూలై 10 తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, మండలస్థాయి ఇరిగేషన్ అధికారులు కూర్చొని సాగు నీరును మూల మూలకు ఎట్లా పారించాలో చర్చలు జరపాలన్నారు.
ప్రతి ఎకరానికి తెలివితో నీటిని సాధించుకోవాలే..
నెత్తిమీద నీళ్లు పెట్టుకొని కరీంనగర్ జిల్లా బాధపడటం సరికాదన్నారు. అప్పర్ మానేరు కరీంనగర్ జిల్లా వరదాయని అని, అప్పర్ మానేర్ కు పూర్వ వైభవం తీసుకురావాలని సీఎం అన్నారు. ఇకనుంచి కరీంనగర్ జిల్లాలో రైతులు రోహిణీ కార్తెలోనే నాటు వేసుకునేలా చూసే బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ టెయిల్ ఎండ్ ప్రాంతాల్లోనే నీటి లభ్యత పుష్కలంగా ఉన్నప్పుడు, ప్రాజెక్టుల పక్కన, రిజర్వాయర్ల వెంట ఉన్న బాల్కొండ, కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, చొప్పదండి, ధర్మపురి, కరీంనగర్, మానకొండూర్, రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో నీరు లభించకపోవడమేమిటి అని ప్రశ్నించారు. ఎత్తైన ప్రదేశాల్లో కూడా నీరు అందేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. తక్కువ శ్రమతో,
తక్కువ ఖర్చుతో ప్రతి ఎకరానికి తెలివితో సాగునీటిని సాధించుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చొని నివేదికను సిద్ధంచేసి తనకు అందించాలని సీఎం తెలిపారు.
నిజాంసాగర్ నీటి విడుదలకు సీఎం ఆదేశం..
మానకొండూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విజ్ఞప్తి చేయడంతో స్పందించిన సీఎం ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మానకొండూరు నియోజకవర్గ పరిధిలో ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరిని సందర్శిస్తానని సీఎం తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల విజ్ఞప్తి మేరకు నిజాంసాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.