కోటి వృక్షార్చనలో భాగంగా నాటిన మొక్కలపై పక్షులు గూళ్లను ఏర్పరచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, ఇది సీఎం కేసీఆర్కు అద్భుతమైన కానుక అని టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్ కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
సంతోష్ పిలుపు మేరకు భూపాలపల్లిలో సింగరేణి డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ మియావాకి పద్ధతిలో తక్కువ ప్రదేశంలో చిన్న అడవిని సృష్టించే విధంగా మొక్కలు నాటారు. ఆ ప్రదేశంలో మొక్కలు పెరిగి పెద్దవి అయి నేడు పక్షులకు, కీటకాలకు ఆవాసంగా మారాయి.‘‘మనం నాటిన మొక్కలు పక్షులకు, కీటకాలకు ఆవాస కేంద్రంగా మారి అంతరించి పోతున్న వివిధ రకాల జాతుల పక్షులకు, కీటకాలకు నిలయంగా మారడం సంతోషంగా ఉంది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటే అంతరించిపోతున్న జీవులను మళ్లీ మనం చూసే వీలు కలుగుతుంది.
వీటిని చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా నాటిన మొక్కలు పెరిగి పెద్దవిగా అయి పక్షులకు, కీటకాలకు నిలయంగా మారడం చాలా సంతోషంగా ఉంది. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం ఇస్తున్న అద్భుతమైన కానుక’’ అని సంతోష్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత తీసుకున్న సింగరేణి డైరెక్టర్ బలరామ్కు సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు.