వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. పూలమాల వేసి నివాళులర్పించారు. ఐదు ఎకరాల స్థలంలో రూ.25 కోట్లతో ఐదు అంతస్తులతో 69 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. ఈ భవనాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అంతకుముందు హన్మకొండలోని ఏకశిలా పార్కులో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం కేసీఆర్.
మరికాసేపట్లో సెంట్రల్ జైలు మైదానానికి వెళ్లి నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. వరంగల్ కేంద్ర కారాగారాన్ని తొలగించి మొత్తం 60 ఎకరాల్లో 24 అంతస్తులతో సకల హాంగులతో ఈ దవాఖానను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2 వేల పడకల సామర్థ్యం, 35 సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఈ దవాఖాన ప్రత్యేకత. 24 అంతస్తుల భవనంపై హెలిప్యాడ్ను సైతం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇక 6.73 ఎకరాల్లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన వరంగల్ అర్బన్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను సైతం సీఎం ప్రారంభించనున్నారు.