తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే ప్రారంభిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హుస్సేన్ సాగర్ సమీపంలో నిర్మించిన 330 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు త్వరలోనే అందజేస్తున్నందుకు గర్వంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మురికివాడగా ఉన్న ఏరియాను అభివృద్ధి చేసి, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించడంపై కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం తో గ్రేటర్ పరిధిలోని 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను విడతల వారీగా లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ అందజేస్తున్నది. ఇప్పటికే 12 చోట్ల 2478 ఇండ్లను ప్రారంభించగా, తాజాగా మరో ఆరు చోట్ల 1273 ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముం దు కంటోన్మెంట్ నియోజకవర్గంలో దాదాపు రూ.20కోట్ల వ్యయంతో గాంధీనగర్, సాయిరాం నగర్లో నిర్మించిన 264 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ నగర్ కాలనీలో 330 ఇండ్లను ఈ నెల 26న లబ్ధిదారులకు ఇచ్చేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. పొట్టి శ్రీరాంనగర్ 162, సీసీ నగర్ 264, జీవై రెడ్డి 180, ఎస్సీ బోస్ నగర్ 60, చిక్కడపల్లి దోబీఘాట్లో 207 ఇండ్లను సదుపాయాల తో ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.