సితాఫలమండీ లోని తన సికింద్రాబాద్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా తాను మంజూరు చేయించిన 72 మందికి రూ.50 లక్షల విలువజేసే చెక్కలను ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పేదలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, ప్రభుత్వ పరంగా పేదలను ఆదుకొనేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు.
కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని తాము ఆదుకుంటామని శ్రీ పద్మారావు గౌడ్ తెలిపారు. బస్తీ దవఖనాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పేదలకు ఓ వర ప్రసాదంగా నిలుస్తోందని తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాతే CMRF ప్రాచుర్యం పేదలకు చేరుతోందని శ్రీ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
తమ పరిధిలో కరోనా వ్యాధి కట్టడికి ఏర్పాట్లు జరుపుతున్నామని తెలిపారు. అత్యవసర సందర్భాల్లో తమ కార్యాలయం తెలిఫోనే నెంబరు 040-27504448లో సంప్రదించాలని శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెరాస యువ నాయకుడు శ్రీ తీగుల్ల రామేశ్వర్ గౌడ్, తెరాస నేతలు పాల్గొన్నారు.