శానసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ర్టంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల స్థాపనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్టంలోని 445 మండలాల్లో విద్యాశాఖతో పాటు వివిధ సంక్షేమ శాఖలతో కలుపుకొని 1201 జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 38 ఎయిడెడ్ కాలేజీలు విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
కేజీబీవీ, మోడల్ స్కూళ్లతో పాటు వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మరో 759 జూనియర్ కాలేజీల నిర్వహణ కొనసాగుతోందని చెప్పారు. పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల్లో స్టూడెంట్ కౌన్సిలర్ను నియమించామని పేర్కొన్నారు. కరోనా కారణంగా విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతో ఇప్పటికే టీ శాట్ ద్వారా 80 శాతం సిలబస్ పూర్తి చేశామన్నారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. 2018-19 విద్యా సంవత్సరంలో ఒక లక్షా 66 వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందితే, 2019-20లో ఒక లక్షా 77 వేల మంది, 2020-21 విద్యా సంవత్సరంలో ఒక లక్షా 78 వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందినట్లు మంత్రి పేర్కొన్నారు. షాద్నగర్ పరిధిలోని కొత్తూరు, నందిగామ, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో నూతన జూనియర్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అవి పరిశీలనలో ఉన్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.