టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్ కుమారుడైన మహమ్మద్ అసదుద్దీన్ శుక్రవారం లోటస్పాండ్లో షర్మిలను కలిశారు. అసదుద్దీన్తో పాటుగా ఆయన భార్య ఆనం మీర్జా కూడా ఉన్నారు.
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు ఆనం మీర్జా సోదరి. రాజకీయ, క్రీడా రంగాల్లో ప్రముఖులైన అజారుద్దీన్, సానియా మీర్జాల కుటుంబ సభ్యులు కొత్తగా పార్టీ పెట్టనున్న షర్మిలను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారు మర్యాద పూర్వకంగానే కలిశారని లోట్సపాండ్ వర్గాలు చెబుతున్నాయి.
ఐతే ఏప్రిల్ 9న ఖమ్మంలో ఏర్పాటు చేయనున్న సభపైన ఆ జిల్లా నేతలతో శుక్రవారం లోట్సపాండ్లో షర్మిల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చరిత్రలో ఇంతవరకు చూడని విధంగా ఖమ్మం సభ జరగాలని వారికి సూచించారు. పార్టీ ఏర్పాటు ఉద్దేశాన్ని, పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేసేదీ ఆ సభలో ప్రకటిస్తాననీ షర్మిల చెప్పినట్లు సమాచారం.
తాను షర్మిలమ్మ రాజ్యం కోసం రాలేదని, దొరల, కుటుంబ పాలన పోయి, రాజన్న సంక్షేమ పాలన రావడం కోసమే ముందుకు వచ్చానని ఖమ్మం నేతలతో ఆమె అన్నారు. ఇదిలా ఉంటే ఈ నెలాఖరుకల్లా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు పూర్తి చేసుకుని ఖమ్మం సభ ఏర్పాట్లపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని షర్మిల శిబిరం నిర్ణయించారు.