తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప చిత్ర కారున్ని కోల్పోయిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అంతర్జాతీయ బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బాలయ్య మరణం చిత్ర కళారంగానికి తీరని లోటన్నారు. ఎంతో మంది కళాకారులను తయారు చేసి ఆయన అందించిన సేవలు సిద్దిపేట గడ్డ మరవదన్నారు. జాతీయ స్థాయిలో బాతిక్ చిత్ర కళాకారునిగా బాలయ్య ఎంతో పేరుగాంచారు.
పల్లె జీవకళను ఉట్టి పడేలా ఎన్నో చిత్రాలను వేసి అంతర్జాతీయంగా తెలంగాణ పల్లె సంస్కృతికి వన్నె తెచ్చారని ఆయన సేవలను మంత్రి కొనియాడారు. సిద్దిపేట బిడ్డగా సిద్దిపేట కీర్తిని తన బాతిక్ చిత్రకళ ద్వారా ఖండతరాలు దాటించిన బాలయ్య మరణం చాలా బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్తో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో బాలయ్య భాగస్వామ్యం అయ్యారని మంత్రి తెలిపారు.
తన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్ 2016లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డును అందజేశారన్నారు. జాతీయ, అంతర్జాతీయ చిత్ర కారునిగా ఎన్నో అవార్డులను సాధించారు. బాతిక్ చిత్ర కారునిగా రాష్ట్రపతి అవార్డును కూడా బాలయ్య అందుకున్నారన్నారు. తన తుది శ్వాస వరకు కూడా చిత్రాలను వేశారన్నారు. ఆయన మరణం పట్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.