బ్రిటన్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ వణికిస్తోంది. పరిస్థితి చేయిదాటి పోయిందంటూ ఏకంగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రే చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో యూకే నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ, బల్గేరియా, బెల్జియం, ఆస్ట్రియా, కెనడా, ఇటలీలాంటి దేశాలు నిషేధం విధించాయి.
కరోనా కొత్త వేరియంట్ తమ దేశాల్లో అడుగుపెట్టకుండా వీళ్లు ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం కూడా యూకే విమానాలపై నిషేధం విధించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోరుతున్నారు.
తక్షణమే ఈ నిర్ణయం తీసుకోవాలంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. బ్రిటన్లో కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ వచ్చింది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తోంది. అందుకే యూకే నుంచి వచ్చే అన్ని విమానాలను వెంటనే నిలిపివేయాలి అని కేజ్రీవాల్ ఆ ట్వీట్లో కోరారు. ఇదే అంశంపై చర్చించడానికి సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ సమావేశం కాబోతున్నది.