కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్బంద్ తెలంగాణలో కొనసాగుతోంది. బంద్కు అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు వామపక్షాలు మద్దతు తెలిపాయి. భారత్బంద్లో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల పరిధిలోని ఆర్టీసీ బస్లు డిపోలకే పరిమితమయ్యాయి. తెల్లవారు జాము నుంచే డిపోల ఎదుట టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు నిరసన తెలిపారు.
ఉమ్మడి నల్గొండ రైతుల సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపోల ఎదుట టీఆర్ఎస్, వామపక్ష నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు ఏడు ఆర్టీసీ డిపోల్లో 600 బస్లు డిపోలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి, అద్దంకి -నార్కెట్ పల్లి రహదారి, హైదరాబాద్ – సాగర్ రహదారి, హైదరాబాద్-వరంగల్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరు డిపోల పరిధిలో సుమారు 600 బస్లు నిలిచిపోయాయి. ఆయా డిపోల ఎదుట నాయకులు నిరసన తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ బంద్కు కార్మిక సంఘాలు, వాణిజ్య సంస్థలు మద్దతు తెలిపాయి. జిల్లాలో బంద్ నేపథ్యంలో ఎనుమామల సహా అన్ని మార్కెట్ యార్డులకు సెలవు ప్రకటించారు. అలాగే కాళోజీ ఆరోగ్య వర్సిటీ, కాకతీయ వర్సిటీలో పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ బస్లు డిపో దాటలేదు. ఆయా డిపోల ఎదుట టీఆర్ఎస్, వామపక్షాల నేతలు నిరసన ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో ఎదుట ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిరసన తెలిపారు. అలాగే మెదక్ రీజియన్ పరిధిలోని 670 బస్ల చక్రాలు కదల్లేదు. నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపో ఎదుట టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, మల్లు రవి, కల్వకుర్తి డిపో ఎదుట ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నిరసన తెలిపారు.
ఖమ్మం డిపో ఎదుట టీఆర్ఎస్ శ్రేణులు, పలు పార్టీ నాయకులు నిరసనలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లన్నీ ప్రయాణికులు లేక బోసిపోయాయి. అలాగే హైదరాబాద్లో బంద్కు ఆర్టీసీ సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. హకీంపేట డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు తెలిపారు. మేడ్చల్ డిపోలో 186, కుషాయిగూడలో 120, కూకట్పల్లి, జీడిమెట్లలో 120, కాచిగూడ, బర్కత్పుర డిపోల్లో నుంచి బస్లు బయటకు రాలేదు.