అందరి హైదరాబాద్ను కొందరి హైదరాబాద్కు మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందిగా మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. నగరంలోని కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్, మూసాపేట్ డివిజన్ల టీఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఆరేళ్లక్రితం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేసి తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రశాంతంగా ఉందన్నారు. నగరంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు.
ఓట్ల కోసం బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరన్నారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తే బీజేపీ నేతలే ఆపారన్నారు. వరద బాధితులందరికి న్యాయం చేస్తామని.. బాధితులందరికీ రూ. 10 వేలు అందిస్తామని తెలిపారు. హైదరబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో పనులు చేపట్టారు. మరి ఆరేండ్లలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో ఒక్కపనైనా చేసిందా అని ప్రశ్నించారు.
పచ్చగా ఉన్న హైదరాబాద్లో బీజేపీ నేతలు నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నరు. ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్లో అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నరు. ఓట్లకోసం శాంతిని చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మంత్రి పువ్వాడ అజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.