కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేందుకే నూతన వ్యవసాయ బిల్లు తీసుకువచ్చారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. దశల వారీగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)ను నిర్వీర్యం చేసే చర్య జరుగుతోందని ఆరోపించారు.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా కనీస మద్దతు ధరను తీసివేసే యోచన జరుగుతోందని అన్నారు. లాభ నస్టాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
‘నూతన వ్యవసాయ బిల్లు అన్యాయమైనది. అందుకే రైతులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్ యార్డులు నిర్వీర్యం అవుతాయి. టోటల్ విధానాన్ని రద్దుచేసి, కార్పొరేట్లకు ద్వారాలు తెరిచారు. ఈ చట్టాలు కేంద్రం చేతుల్లోకి తీసుకోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతంది.
నూతన విద్యుత్ విధానం రైతులకు శరాఘాతం వంటిది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెసులుబాటు కల్పిస్తే కేంద్రం ఫెడరల్ విధానానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. విద్యా విధానం, జీఎస్టీ, తదితర పథకాలు అన్నీ కూడా రాష్ట్రాల మీద భారం మోపుతోంది. కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతోంది.’ అని మండిపడ్డారు.