తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం అన్నది ఆరంభం మాత్రమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. అన్ని వర్గాలవారికి భూ సంబంధిత ఇబ్బందులు తొలిగించేలా దశలవారీగా మరిన్ని మెరుగైన విధానాలను తీసుకొని రానున్నామని శుక్రవారం శాసనసభ వేదికగా ప్రకటించారు. శతాబ్దాలుగా ఉన్న భూముల సమస్యలకు సమగ్ర డిజిటల్ సర్వే ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో వీలైనంత త్వరగా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే చేస్తామని చెప్పారు. రికార్డులన్నీ పలు సర్వర్ల ద్వారా భద్రంగా ఉంటాయని.. కొత్త సచివాలయంలోనూ స్ట్రాంగ్రూంను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరూ పట్టించుకోలేదని, శనివారం నుంచి ఈ భూములకు సంబంధించిన క్రయవిక్రయాలన్నింటినీ నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. సాదాబైనామాల కింద ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు చిట్టచివరిసారి అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ బిల్లుపై అసెంబ్లీలో దాదాపు ఆరుగంటలపాటు చర్చ జరిగిన అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. రెవెన్యూబిల్లుపై సీఎం సమాధానం ఆయన మాటల్లోనే..
ఈ చట్టం నాంది మాత్రమే
రెవెన్యూ భూములపై ఉన్న చట్టాలు ఒక్క రోజులో తయారుచేసినవి కావు. అనేక శతాబ్దాలుగా, చాలా సందర్భాల్లో చాలా చట్టాల సమూహంగా ఈ వ్యవస్థ ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 170 రెవెన్యూ చట్టాలుండేవి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో బ్రిటిష్ పాలనకు చెందినవి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాటిని కొన్నింటిని మనం తొలగించినం. ప్రస్తుతం రాష్ట్రంలో 87 రెవెన్యూ చట్టాలు ఉన్నయి. ఇప్పుడు అన్నీ తీస్తలేం. ఆర్వోఆర్, ధరణి చట్టాలే సర్వస్వం కాదు. మిగిలిన అన్నీ ఉంటయి. రోజువారీగా ప్రజలకు ఇబ్బంది అయి, అవినీతికి ఆస్కారమవుతున్న వాటితోనే కొత్త విధానం ప్రారంభిస్తున్నం. ఇది అంతం కాదు. ఆరంభం మాత్రమే. భగవంతుని దయతో కన్క్లూజివ్ టైటిల్ దశకు తప్పకుండా చేరుకుంటమనే ఆశ నాకు ఉన్నది. కన్క్లూజివ్ టైటిల్ ఇస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దీంట్లో తిరకాసు ఉంటది. కన్క్లూజివ్ టైటిల్ ఇస్తే ప్రభుత్వం మీద భారముంటుంది. ఇదీ టైటిల్ అని సెక్రటరీ కన్క్లూజివ్ ఇచ్చిన దాన్ని కోర్టు కొట్టేస్తే ప్రభుత్వం పరిహారం కట్టాలె. కన్క్లూజివ్ టైటిల్దిశగా చేరుకొనే పరిణతి కొన్ని రోజుల్లో వస్తది. ఇప్పుడు తెచ్చిన చట్టాలు దీనికి మొదటి అడుగు.
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సర్వే
సర్వే ప్రభుత్వం చేసినా, ప్రైవేటు చేసినా తేడారాదు. మన సర్వే డిపార్టుమెంట్ ఉంటది. ఎందుకంటే దీనికి టిప్పన్ నంబర్ల వ్యవస్థ ఉంటుంది. కాకపోతే గుణాత్మకమైన మార్పు ఉంటది. నిజాంకాలంలో ఇవ్వలేదు. ఒట్టిగ ఉన్నయి. కోఆర్డినేట్స్.. అంటే అక్షాంశ, రేఖాంశాలు ఇస్తం. ఇవి భూగోళం ఉన్నదాకా ఉంటయి. ఎవరూ మార్పు చేయలేరు. ట్యాంపరింగ్ చేయలేరు. విమానం చీకట్లో కూడా ఎగురుతుంది. ఎలా? కోఆర్డినేట్స్ ఉంటాయి. కంపాస్ సహకారంతో నడుపుతరు. ఆ డైరెక్షన్లో సెట్చేస్తే హెలికాప్టర్గానీ, విమానంగానీ వెళ్లిపోతయి. కండ్లు మూసుకొని ల్యాండ్ అయిపోతయి. కోఆర్డినేట్స్ ఒక్కసారి ఇస్తే.. సమస్య అనేది ఉండదు. భూముల కోఆర్డినేట్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు చాలా సులభమైంది. కొత్త టెక్నాలజీ వచ్చింది. భూ సర్వే అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేటు కంపెనీలు చేస్తయి. కోఆర్డినేట్ విషయంలో అబద్ధం చెప్పలేరు. అంతర్జాతీయంగా ఉంటుంది. టాంపరింగ్కు అవకాశం ఉండదు. సర్వే చేసేందుకు చాలా కంపెనీలు ఉన్నయి. మంచి యంగ్స్టర్స్ ఉన్నరు. బ్రహ్మాండంగా చేస్తమన్నరు. వీలైనంత త్వరగా భూ సమగ్ర సర్వే జరుగుతుంది. ప్రతి సర్వేనంబరుకు కోఆర్డినేట్స్ ఇస్తరు.
ఎన్నో చిక్కుముడులు..
భూముల విషయంలో అనేక సమస్యలున్నయి. ఒకరోజు నేను పొలంకాడికి వెళ్తుంటే శామీర్పేట మండలం లక్ష్మాపూర్లో ఆగిన. అక్కడివారితో మాట్లాడిన. ఏమైనా సమస్యలు ఉన్నయా, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయా అని అడిగిన. అంతా బాగానే ఉన్నదని అన్నరు. అయితే వాళ్లు విచిత్రమైన సమస్య చెప్పిన్రు. ఆ ఊరు మొత్తానికి పట్టా లేదని చెప్పిన్రు. ఇప్పుడు మూడు చింతలపల్లి మండలం అయ్యింది. 1969లో చెన్నారెడ్డితో కలిసి ఉద్యమంచేసిన ప్రముఖ నాయకుడు వీరారెడ్డి ఊరు అది. ఆ ఊరికి ఏదైనా చేయాలని అక్కడ ఆగిన. అభివృద్ధి పనులు చేసిన. మండలం కావాలంటే చేసిన. ఆ గ్రామానికి పట్టాలేదు. ఆ ఊరి వాళ్ల భూములకు రికార్డు లేదు. అమ్ముదామంటే టైటిల్ రాదు. ఇలా ఉన్నయి సమస్యలు. రెవెన్యూ చట్టంపై చాలామంది అభిప్రాయాలు తెలుసుకున్న. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కూడా మాట్లాడిన. శాసనసభకు రావాలని కోరిన. ఏమైనా సలహాలు ఇవ్వాలని అడిగిన. ఆయన ఇక్కడికి వచ్చిండు. చిగురుమామిడి మండలం రేగొండ చాడ వెంకటరెడ్డి సొంత ఊరు. అక్కడ ఆయనకు ఐదెకరాలు ఉన్నది. ఆ ఊరిలో సీలింగ్ మిగులు భూముల అంశం ఇంకా అస్పష్టంగానే ఉన్నది. పొజిషన్ మీద ఎక్కువ, పాస్పుస్తకంలో తక్కువ జాగ వంటివి కొన్ని ఉండవచ్చు. ‘మాకు పెద్దగా భూమి ఉండె. చేసుకుంట చేసుకుంట వస్తుంటే తక్కువ వచ్చింది. మా భూమి కొలిస్తే తక్కువగా వచ్చింది. పక్కవాళ్లకు కలిసిందని తేలింది. ఇది మీదేనని వాళ్లు ఇచ్చిండ్లు’ అని చెప్పిండు. ఇది ఇరవై ఏండ్ల కింది ముచ్చట. ఇలాంటివాటికి అనేక కారణాలు ఉన్నయి. డిజిటల్ సర్వే నాకు బాగా నచ్చిందని ల్యాండ్ రికార్డు విభాగం రిటైర్డ్ ఏడీ ఒకాయన ఇయ్యాల పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు. కొన్ని జిల్లాల్లో టిప్పన్లు ముట్టుకుంటే చినిగిపోయే పరిస్థితి ఉందని చెప్పిండు. ఇలా ఎన్నో సంక్లిష్టతలతో చిక్కుముడులు పడ్డయి.
జాగీర్లు ఉన్నయా?
ఇప్పుడు జాగీర్లు ఉన్నయా? జాగీర్దార్లు ఉన్నరా? ఎప్పటివరకు ఇది? ఎనుకట జాగీర్దారు, మక్తేదారు నాకిచ్చిండని తప్పుడు కాగితాలు తెచ్చి కోకొల్లలుగా దుర్మార్గాలు చేస్తున్నరు. దీనివల్ల పిచ్చిపిచ్చి కేసులు, పనికిమాలిన కేసులు ఎన్నో జరుగుతున్నయి. వీటన్నింటికీ నివారణ అంటే భూముల వివరాలు అప్డేట్ కావాలె, అంతా డిజిటలైజ్ కావాలె. ప్రతి సర్వే నంబర్కు ల్యాండ్ కోఆర్డినేట్ అలాట్ కావాలె. సమగ్ర డిజిటల్ సర్వే పూర్తయితేనే దేనికది తెలుస్తది. సర్వే అంటే పెద్ద ప్రక్రియ కదా మూడునాలుగేండ్లు పడుతదేమోనని ముందు నేను కూడా భయపడ్డ. టెక్నాలజీ పెరిగింది. చాలా తొందరగా జరిగే అవకాశమున్నది. చాలా కంపెనీలు ముందుకొస్తున్నయి. ఒక్కో జిల్లా ఇవ్వాలని కోరుతున్నారు. అదే సమస్య కాదు. ఏదైనా కొత్త రకమైన సమస్య వస్తే పరిష్కారంకోసం ప్రత్యేకంగా క్లాసు పెట్టుకుంటం. రాబోయే రోజుల్లో అవసరం లేని మరో రెండుమూడు చట్టాలను కూడా తీసేస్తం.
బాధ్యతలో ఉన్న వారు ధైర్యం చేయాలె
భూముల విషయంలో ఉన్న చిక్కుముడులతో నానారకాల అరాచకాలు, పెడ ధోరణలు ప్రబలుతున్నాయి. దీనికి సమాధానం కావాలి. బాధ్యతలో ఉన్నవారు ప్రేక్షకపాత్ర వహిస్తే పెద్ద నేరమవుతుంది. ఎవరో ఒకరు ధైర్యం చేయాలె. ఏదో ఒక గ్రామం ఎంపిక చేసుకుని వెళ్ద్దాం. చాలా గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. క్లిష్టంగా ఉన్నవి చాలా తక్కువ. వాటిని కూడా పరిష్కరిస్తం. అన్నింటికీ పరిష్కారం కావాలి. అయితది. ఒక పద్ధతి మారేటప్పుడు సులభంగా అంగీకరించరు. మార్పు ఒడిలో కూర్చుని కూడా మారుతుంటే నిరసన చేస్తం. ఒక చట్టంతో ఏకబిగిన అంతా మారుతుందని ఎవరూ నమ్మరు. కొన్నింటికి తక్షణ సమాధానాలు, కొన్నింటికి దీర్ఘకాలిక పరిష్కరాలు ఉంటయి. ఇది ఆరంభమే. ఇలా కన్క్లూజివ్ టైటిల్ దిశగా పనిచేస్తం. డిజిటల్ సర్వేతోనే 99% సమస్యలకు పరిష్కారం వస్తుంది. ఇప్పటికే ఉన్న భూముల కేసుల పరిష్కారం కోసం ఏర్పాటుచేస్తున్న ట్రిబ్యునళ్లలో ఐఏఎస్ అధికారులనే నియమిస్తం. మనకు నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన ఐఏఎస్లు చాలామంది ఉన్నరు. వారిని నమ్మకుండా మనం ఏమీ చేయలేం.
త్వరలోనే డిజిటల్ సర్వే
భూముల డిజిటల్ సర్వే రెండో అడుగు. డిజిటల్ సర్వేను అందరు ప్రశంసిస్తున్నరు, ఆహ్వానిస్తున్నరు. భూములను సర్వేచేసే సాహసం ఏ ప్రభుత్వం చెయ్యలే. భూములకు సంబంధించి సమగ్ర సర్వే జరగాలి. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. అధునాతన టెక్నాలజీ వచ్చింది. సర్వే అంటే భయపడే పరిస్థితి లేదు. కేంద్రం ఇరవైముప్ఫై ఏండ్ల కింద మొదలుపెట్టింది. నిజామాబాద్ జిల్లాలో చేసింది. అది ఇప్పటికీ పూర్తికాలేదు. ఇప్పుడు మనం చెప్తున్నది డిజిటల్ సర్వే. డిజిటల్ కంపెనీలు చాలా ఉన్నయి. నా నియోజకవర్గంలోనే ఇటిక్యాల- కొత్తపేట గ్రామాల మధ్య సమస్య ఉంటే ప్రయోగాత్మకంగా సర్వే చేయించిన. దాన్ని ప్రజల ముందు పెట్టినం. 570 ఎకరాలకు కొన్ని సందేహాలు మాత్రమే వచ్చాయి. జిల్లా కలెక్టర్ వెళ్లి పూర్తిచేశారు. డిజిటల్ సర్వే మూడేండ్ల నుంచి నా మనసులో ఉన్నది. దీన్ని బాగా విమర్శనాత్మకంగా పరిశీలిస్తున్నా. కచ్చితంగా పూర్తి చేసి తీరుతం.
మూడు రూపాల్లో రికార్డులు
రికార్డులు అనేవి ఎలక్ట్రానిక్స్వే ఉంటయా? హార్డ్కాపీలు ఉంటయా? అని భట్టి విక్రమార్క అడిగారు. రెండూ చేస్తం. కొత్తగా నిర్మించే సచివాలయంలో స్ట్రాంగ్ రూం, రికార్డు రూం కూడా పెట్టినం. శాస్త్రీయంగా ఎట్ల ఉండాల్నో అట్ల పెట్టినం. ఇది మూడురకాలుగా ఉంటది. ఆపరేటివ్ ఎలక్ట్రానిక్, పోర్టల్ రూపంలో ఉంటుంది. సీడీ రూపంలో డిజిటల్గా ఉంటది. డాక్యుమెంట్ రూపంలో కూడా పెడతం.
సర్వర్లలో సురక్షితంగా
భూ రికార్డులు అతి ముఖ్యమైనవి అందుకే డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం ఉంటది. దానిని బ్యాకప్ మెకానిజం అని కూడా అంటరు. హైదరాబాద్కు ఐటీ వచ్చింది కూడా అందుకే. దక్కన్ పీఠభూమిలో భూకంపాలు తక్కువ వస్తయి అందుకే చాలా పెద్దపెద్ద కంపెనీలు ఇక్కడికి వచ్చినయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం హైదరాబాద్లో పెట్టుకుంటే సేఫ్ అని.. రాజీవ్గాంధీ రిక్వెస్ట్ చేస్తే వచ్చింది. కాకపోతే మధ్యలో కొందరు మేం చేయబట్టే ఐటీ వచ్చిందని డబ్బా కొట్టుకున్నరు.. అది వేరే విషయం. హైదారాబాద్ చాలా సేఫ్. మల్టిపుల్ సర్వర్లు పెట్టమని ఆదేశాలిచ్చినం. ఎంత ఖర్చయినా వెనక్కి పోవద్దని చెప్పినం. ఇక్కడ భూకంపాలొచ్చి, ఎట్లనో పోయినా వేరేచోట సర్వర్లలో నిక్షిప్తమై ఉంటది కాబట్టి సేఫ్గా ఉంటది. మన రికార్డులను ప్రపంచంలో ఉత్తమ విధానాన్ని ఎంచుకొని అక్కడ పెడతం.
అనుభవదారు కాలమ్ ఉండదు..
జాగీర్దార్లు, జమీందార్లు, బడా భూస్వాములు ఉన్నప్పుడు కౌలుదారును రక్షించాలన్న ఉద్దేశంతో తెచ్చినదే అనుభవదారు కాలమ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనుక అనుభవదారు కాలమ్ను పాస్బుక్కులో పెట్టేదిలేదు.
సర్వేపై గందరగోళం లేదు
సర్వే చేసేందుకు చాలా కంపెనీలు ఉన్నయి. మంచి యంగ్స్టర్స్ ఉన్నరు. బ్రహ్మాండంగా చేస్తమన్నరు. వీలైనంత త్వరగా భూ సమగ్ర సర్వే జరుగుతుంది. దానికి ఎవరూ గందరగోళపడాల్సిన అవసరంలేదు.
అక్షాంశ రేఖాంశాలతో లంకె
అప్పట్లో టెక్నాలజీ లేదు కాబట్టి ఇవ్వలేదు. కోఆర్డినేట్స్.. అంటే అక్షాంశ, రేఖాంశాలు ఇస్తం. ఇవి భూగోళం ఉన్నదాకా ఉంటయి. విమానం చీకట్లో కూడా ఎగురుతుంది. ఎలా? కోఆర్డినేట్స్ ఉంటాయి. కోఆర్డినేట్స్ ఒక్కసారి ఇస్తే.. సమస్య అనేది ఉండదు. భూములకు కోఆర్డినేట్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు చాలా సులభమైంది.
ట్రిబ్యునళ్లలో వీరే
భూవివాదాలపై వేయనున్న ట్రిబ్యునళ్లు శాశ్వతం కాదు. నిజాయితీపరులైన, క్రమశిక్షణ కలిగిన ఐఏఎస్ అధికారులెంతోమంది ఉన్నారు. వారిలో సర్వీస్లో ఉన్నవారు, రిటైర్ అయిన వారిని సభ్యులుగా వేస్తాం.
రెవెన్యూ.. హైలీ పర్ఫార్మెన్స్ శాఖ
రెవెన్యూ డిపార్ట్మెంట్ హైలీ పర్ఫార్మెన్స్ శాఖ. సందర్భానుసారంగా చాలా పనులుచేస్తారు. విపత్తులు, ఇతర అత్యవసర సమయాల్లో నిద్రాహారాలు మానేసి పనిచేస్తారు. వారికి 54 రకాల విధులు ఉన్నాయి. వేరేవాళ్లు చేయలేరు. ఒక్క వీఆర్వో తప్ప అందరూ ఉంటారు. మొత్తం రెవెన్యూ వ్యవస్థ చెడిపోయిందని చెప్పలేం. కొందరు తప్పు చేయొచ్చు. ఎక్కువ బాధలు పెట్టింది వీఆర్వోలు అని సమాజం నుంచి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థను నిర్మూలించాం.