రైతుబంధు నిధులు ఇంకా జమకాని రైతుల సందేహాలను క్షేత్రస్థాయి అధికారులు తీర్చాలని తెలంగాణ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రైతుబంధు పథకం అమలులో ఏ విధమైన ఆంక్షలు లేవని..
సాగు చేసే రైతన్నకు సాయంగా నిలబడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యవసాయ విధానాలు దేశానికి ఆదర్శమని.. ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే ఆరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా నిలిచిందని నిరంజన్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకున్న రైతులందరి ఖాతాల్లో రైతుబంధు నిధులు జమయ్యాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
రైతుబంధు పథకం క్రింద కేవలం 48 గంటల్లో 54.21 లక్షల రైతుల ఖాతాల్లో రూ.6,886.19 కోట్లు జమచేసినట్టు వెల్లడించారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, చిత్తశుద్దికి ఈ చర్య నిదర్శనమని మంత్రి తెలిపారు.